Bhatti Vikramarka: సీఎం కేసీఆర్కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి ద్వారా హక్కులు లేకుండా చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. లక్షల మంది ఆదివాసీల, గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు రాసిన బహిరంగ లేఖలో భట్టి కోరారు.
Bhatti Vikramarka: హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం విధితమే. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పోలంపల్లి గ్రామంలో సోమవారం పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పోడు రైతులకు హక్కు పత్రాలను ఇవ్వాలని బహిరంగ లేఖలో భట్టి కోరారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్చి 16 నుంచి ఆదిలాబాద్ జిల్లా, బోథ్ నియోజకవర్గం, పిప్పిరి గ్రామం నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టానని, 18 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నా వద్దకు ఆదివాసీలు, గిరిజనులు వేలాదిమంది వచ్చి తమ పోడు భూముల సమస్యలను ఏకరవు పెట్టుకున్నారని అన్నారు.
కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి ద్వారా హక్కులు లేకుండా చేసిందని ఆవేదన చెందారు. లక్షల మంది ఆదివాసీల, గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు రాసిన బహిరంగ లేఖలో భట్టి కోరారు. ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గగొండ తదితర జిల్లాల్లో పోడు చేసుకుంటున్న రైతులకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని అన్నారు. పోడు పట్టాలపై 2014 నుంచి మీరు, మీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ నీటిమీద రాతలుగా మారాయని విమర్శించారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో పోడు భూముల సమస్యలను మీరు అస్త్రంగా వాడుకుని గెలిచిన తరువాత మరిచిపోయినా.. ఆ అంశాన్ని గిరిజనులు గుర్తుపెట్టుకున్నారని, హామీని నెరవేర్చకుంటే తగిన గుణపాఠం చెబుతారని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశాల్లో 11.50 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారని భట్టి గుర్తు చేశారు. మంత్రి హరీష్ రావు గత నెల 9న జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో లక్ష 55 వేల 393 మందికే మొదటి విడతలో హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించారని, నాలుగు లక్షలమంది గిరిజనలు హక్కు పత్రాలకోసం ఎదురుచూస్తుంటే 1.5 లక్షమందికే పట్టాలిస్తామనడం గిరిజనులను నిట్టనిలువునా మోసం చేయడమేనని భట్టి తెలిపారు. కేంద్ర అటవీ హక్కుల చట్ట ప్రకారం.. అడవిపై, అడవి ఫలాలపై పోడు భూములపై గిరిజనులకే పూర్తి హక్కులు ఉన్నాయని భట్టి తెలిపారు. పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు. పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీగా శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు. పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తుందని, ఆదివాసీలు, గిరిజన రైతులు రోడ్లమీద కు రాకముందే పోడు భూముల సమస్యను పరిష్కరించాలని ఆశిస్తున్నామని కేసీఆర్ కు రాసిన లేఖలో భట్టి పేర్కొన్నారు.