United Progressive Alliance: యూపీఏ పేరు మారబోతోందా? బెంగళూరు విపక్షాల మీటింగు నేపథ్యంలో ఆసక్తికర విషయం
యూనైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది 2004లో ఏర్పడింది. ఈ కూటమిలో 19 పార్టీలు ఉన్నాయి. దీనికి చైర్ పర్సన్ సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ కూటమి తరపున లోక్సభ నాయకుడిగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి వ్యవహరిస్తుండగా.. రాజ్యసభ నాయకుడిగా ప్రస్తు కాంగ్రస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఉన్నారు
![United Progressive Alliance: యూపీఏ పేరు మారబోతోందా? బెంగళూరు విపక్షాల మీటింగు నేపథ్యంలో ఆసక్తికర విషయం United Progressive Alliance: యూపీఏ పేరు మారబోతోందా? బెంగళూరు విపక్షాల మీటింగు నేపథ్యంలో ఆసక్తికర విషయం](https://10tv.in/wp-content/uploads/2023/07/Untitled-1-117.jpg)
Patriotic Democratic Alliance: దగ్గర దగ్గర రెండు దశాబ్దాల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూనైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) పేరు మారనున్నట్లు తెలుస్తోంది. విపక్షాల రెండవ సమావేశాలు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు (జూలై 17) ప్రారంభమయ్యాయి. కాగా ఈ సమావేశాలు ప్రారంభమయ్యే ముందే.. యూపీఏ పేరు మారనున్నట్లు పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ విషయమై కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం దాదాపుగా అవునన్నట్లుగానే సమాధానం వచ్చింది.
యూపీఏ పేరు మార్చబోతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘సమావేశంలో మేము చాలా నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఏం నిర్ణయాలు తీసుకుంటాం, వేటిపై చర్చ చేస్తామని ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే ఏ నిర్ణయమైనా కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకోదు. విపక్ష పార్టీలన్నీ కలిసి చర్చించి, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటాయి’’ అని అన్నారు. అయితే ఆయన యూపీఏ పేరు మార్పును కొట్టిపారేయలేదు. పేరు మార్పు గురించి అడగగానే చాలా నిర్ణయాలు తీసుకుంటామని బదులిచ్చారు.
ఇక జూన్ 23న బిహార్ రాజధాని పాట్నాలో జరగిన విపక్షాల మొదటి మెగా సమావేశం అనంతరమే.. విపక్ష కూటమికి ‘పేట్రియాటిక్ డెమొక్రిటిక్ అలయన్స్’ అని పేరు పెడతారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం జరిగే సమావేశాల్లోనే విపక్షాల కూటమి పేరు ఖరారు కానుంది. అయితే పీడీఏ అని ఫైనల్ చేస్తారా, మరో పేరేదైనా పెడతారా అనేది తెలియాలి.
ఇక యూనైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది 2004లో ఏర్పడింది. ఈ కూటమిలో 19 పార్టీలు ఉన్నాయి. దీనికి చైర్ పర్సన్ సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ కూటమి తరపున లోక్సభ నాయకుడిగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి వ్యవహరిస్తుండగా.. రాజ్యసభ నాయకుడిగా ప్రస్తు కాంగ్రస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఇక కొత్తగా ఏర్పడే కూటమిని యూపీఏగానే కొనసాగించాలని కొందరు అంటున్నప్పటికీ.. పేరు మార్పుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.