Sanatana Dharma Row: సనాతన ధర్మ వివాదంపై ఇండియా కూటమిలో తలో మాట.. ఎన్నికల నాటికి కూటమి ఉంటుందా?

శివసేన (యూబీటీ) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. భారతీయ ధర్మం సనాతనం చాలా గొప్పదని, రాజకీయాల కోసం దానిపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

Sanatana Dharma Row: సనాతన ధర్మ వివాదంపై ఇండియా కూటమిలో తలో మాట.. ఎన్నికల నాటికి కూటమి ఉంటుందా?

2024 Elections: సనాతన ధర్మ వివాదంపై ఇండియా కూటమిలోని నేతలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వంటిదంటూ డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల అనంతరం దేశ వ్యాప్తం దుమారం చెలరేగింది. అధికార భారతీయ జనతా పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అంటేనే సనాతన ధర్మానికి వ్యతిరేకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాగా, బుధవారం మంత్రి మండలి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం దీనిపై స్పందించి, సరైన విధానంలో జవాబు ఇవ్వాలంటూ మంత్రులకు సూచించారు.

CM MK Stalin : కుమారుడు ఉదయనిధి ‘సనాతన’వ్యాఖ్యలపై నోరు విప్పిన సీఎం స్టాలిన్ .. వాస్తవాలు తెలుసుకోవాలంటూ ప్రధానికి కౌంటర్

అయితే విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల్లోనే ఈ వివాదంపై తలా ఒక వైఖరి ప్రదర్శిస్తున్నారు. అయితే పార్టీ అధినేతలు మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. ముఖ్యంగా ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ ఏంటో చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నప్పటికీ.. గాంధీ కుటుంబం సహా ఆ పార్టీలోని అగ్ర నేతలు మౌనాన్నే కొనసాగిస్తున్నారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ నేతలు కొందరు ఉదయనిధి వ్యాఖ్యలకు పూర్తిగా మద్దతు తెలుపుతుండడం గమనార్హం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున తనయుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటుగానే స్పందించారు. సమానత్వాన్ని పాటించని ధర్మమేదీ మతం కాదని, సనాతన ధర్మానికి సమానత్వం లేదని అన్నారు.

ఇక రాష్ట్ర మరో మంత్రి జీ.పరమేశ్వర సైతం సనాతన ధర్మంపై విమర్శలు గుప్పించారు. ఆయన మరో అడుగు ముందుకు వేసి అసలు హిందుత్వమనేది ఎప్పుడు వచ్చింది, ఎవరు తీసుకువచ్చారంటూ ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ లోని కొందరు నేతలు ఇందుకు విరుద్ధంగా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్క మతానికి దానికుండే విలువలు ఉంటాయని, ఎవరూ ఎవరి మతాన్ని విమర్శించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే ఉదయనిధి వ్యాఖ్యలను మాత్రం బహిరంగంగా ఇప్పటికీ ఎవరూ ఖండించకపోవడం గమనార్హం.

ఇక బిహార్ లోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, జేడీయూ ఈ వివాదంపై పరస్పరం భిన్నంగా స్పందించాయి. ఉదయనిధికి ఆర్జేడీ మద్దతుగా వ్యాఖ్యానించగా.. జేడీయూ మాత్రం వ్యతిరేకంగా స్పందించింది. సనాతనాన్ని పాటించే వారు, ప్రచారం చేసేవారు దేశాన్ని బానిసత్వానికి మార్చారని ఆర్జేడీ నేత జగదానంద్ అన్నారు. అయితే అన్ని మతాలకు తమ పద్దతులపై వెళ్తాయని, ఎవరి ధర్మాన్ని వారు పాటించుకుంటారని, వాటిపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని జేడీయూ నేత జమా ఖాన్ స్పందించడం విశేషం.

ఇక శివసేన (యూబీటీ) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. భారతీయ ధర్మం సనాతనం చాలా గొప్పదని, రాజకీయాల కోసం దానిపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని కొందరు నేతలు కూడా ఉయదనిధి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇండియా కూటమిలోని ఏ పార్టీ అధినేతలు కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈ వివాదం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై ఇదెంత ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి.

Sanatana Dharma Row: సనాతన ధర్మ వివాదంపై దూకుడు పెంచిన డీఎంకే నేతలు.. హెచ్ఐవీ, కుష్ఠురోగమంటూ విరుచుకుపడ్డ ఎంపీ ఏ.రాజా

ఎందుకంటే.. ఈ వివాదంపై కూటమిలోని ఒక్కో పార్టీ ఒక్కోలా స్పందిస్తోంది. డీఎంకే పూర్తిగా ఉదయనిధితో ఉండగా శివసేన పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అలాగే కాంగ్రెస్ లోని దళిత నేతలు ఒకలా ఇతరులు మరొకలా స్పందిస్తున్నారు. ఈ వివాదం ఎన్నికల అంశంగా మారితే మాత్రం కూటమిలో లుకలుకలు ప్రారంభైనట్లేనని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వివాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. అలా అని వ్యతిరేకించే వారితో కలిసి ఎన్నికలకు వెళ్లడం కష్టమే. ఇప్పటికే అనేక లుకలుకల నడుమ ఇండియా కూటమి ఏర్పడింది. ఇలాంటి వివాదాలకు అది కదిలే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.