Mahindra Price Hike : జనవరి 2024 నుంచి భారీగా పెరగనున్న మహీంద్రా కార్ల ధరలు.. ఏయే మోడల్స్ ఉన్నాయంటే?
Mahindra Price Hike : వచ్చే జనవరి 2024 నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ధరలను పెంచనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరిగిన కమోడిటీ ధరల కారణంగా ధరలను పెంచనున్నట్టు పేర్కొంది.
Mahindra Price Hike : ప్రముఖ భారతీయ ఎస్యూవీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ధరలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఎస్యూవీ, సీవీ రేంజ్ కార్ల ధరలను జనవరి 2024 నుంచి పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరిగిన కమోడిటీ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
ఈ అదనపు ఖర్చులను భరించేందుకు తాము ప్రయత్నించామని, అయితే, ఈ ధరల పెరుగుదలలో కొంత భారాన్ని కస్టమర్లపై వేయనున్నట్టు మహీంద్రా తెలిపింది. దాంతో వినియోగదారులు మహీంద్రా ఎస్యూవీ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్యూవీలు, వాణిజ్య వాహనాల ధరల పెరుగుదలలో భిన్నంగా ఉంటుందని గమనించాలి.
సెప్టెంబర్లో ఒకసారి.. వచ్చే జనవరిలో మరోసారి పెంపు :
మహీంద్రా అధికారిక ప్రకటన ప్రకారం.. జనవరి 1 నుంచి కార్ల ధరలను పెంచనుంది. కాంపోనెంట్ ధరల ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగాయని వాహన తయారీ సంస్థ పేర్కొంది. థార్, స్కార్పియో-ఎన్, ఎక్స్యూవీ700 వంటి ఎస్యూవీలలో కొనుగోలు ఖర్చులు రూ. 43,500 పెరిగినందున సెప్టెంబర్లో భారీగా ధరలను పెంచింది. ఆ తర్వాత మరోసారి ధరలను జనవరి 2024లో పెంచనున్నట్టు ప్రకటించింది.
ఆటోమేకర్ కార్ల ధరలు ఎంత శాతానికి పెరుగుతాయో పేర్కొననలేదు. అయితే కచ్చితమైన సంఖ్య ఎంత అనేది తర్వాతి తేదీలో మాత్రమే తెలుస్తుంది. మహీంద్రాతో పాటు, ఎంజీ మోటార్ ఇండియా, ఆడి ఇండియా వంటి ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా జనవరి 2024 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి.
కార్లపై తగ్గింపు :
మరోవైపు మిగిలిన స్టాక్పైనా తగ్గింపు అందిస్తోంది. స్టాక్ను క్లియర్ చేయడానికి, కస్టమర్లకు ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ సమయంలో, మహీంద్రా ఎక్స్యూవీ 300 రేంజ్, ఆల్-ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ 400పై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా ఏడాది చివర్లో కస్టమర్లు లక్షల విలువైన డిస్కౌంట్లను పొందవచ్చు.
కంపెనీ వివరాలివే :
మహీంద్రా అండ్ మహీంద్రా 1945 సంవత్సరంలో స్థాపించారు. ప్రస్తుతం మహీంద్రా గ్రూప్ 100 కన్నా ఎక్కువ దేశాలలో 2లక్షల 60వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. భారత మార్కెట్లో వ్యవసాయ పరికరాలు, యుటిలిటీ వాహనాలు, సమాచార సాంకేతికత, ఆర్థిక సేవలలో అగ్రగామిగా ఉంది. వాల్యూమ్ ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా పేరొందింది.