Covid guidelines : మాస్కులు, వ్యాక్సిన్, ఐసోలేషన్…ఇవీ సర్కార్ తాజా కొవిడ్ మార్గదర్శకాలు
కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు కొవిడ్ వైరస్ వ్యాప్తిచెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం సూచించింది....
Covid guidelines : కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు కొవిడ్ వైరస్ వ్యాప్తిచెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. ప్రజలు వైరస్ సోకకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని కర్ణాటక సర్కారు కోరింది. కొవిడ్ వైరస్ సోకిన రోగులు హోం ఐసోలేషన్ లో ఉండాలని ప్రజలను నిర్ధేశించింది.
30వేల డోసుల కార్బెవాక్స్ వ్యాక్సిన్
కరోనా వైరస్ గణనీయంగా పెరిగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్ వైరస్ సోకితే ఏడు రోజుల పాటు ఇంట్లో ఒంటరిగా ఉండాలని, కొవిడ్ లక్షణాలున్న పిల్లలను పాఠశాలలకు పంపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వృద్ధులు, ఇతర రోగాలు ఉన్న వారు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది. దీని కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి 30వేల డోసుల కార్బెవాక్స్ వ్యాక్సిన్ ను కొనుగోలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్
కొవిడ్ నివారణకు కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై కీలక నిర్ణయాలు చేసింది. నూతన సంవత్సర వేడుకలు, సమావేశాలపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలని అధికారులు సూచించారు. కోవిడ్ సోకిన వ్యక్తులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని పక్షంలో వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని మంత్రి కోరారు.
ALSO READ : సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధం
హోమ్ ఐసోలేషన్లో ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఒక వారం తప్పనిసరి క్యాజువల్ సెలవు ఇవ్వాలని, ఆసుపత్రిలో చేరిన వారికి ఆసుపత్రిలో చేరే వ్యవధికి ప్రత్యేక సెలవు ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేస్తామని మంత్రి చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు 34 నమోదయ్యాయి. ఆక్సిజన్, పడకలను సిద్ధం చేశామని మంత్రి చెప్పారు.
ALSO READ : TDP : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలోని కరోనావైరస్ జేఎన్.1 సబ్-వేరియంట్కు సంబంధించి పరిస్థితిని అంచనా వేయడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 60 ఏళ్ల వయసు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఇంటి లోపల, ఆరుబయట మాస్క్లను ఉపయోగించాలని సీఎం సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు.