WTC Rankings : భారత్కు ఆస్ట్రేలియా గండం.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో టీమ్ఇండియాను వెనక్కినెట్టిన ఆసీస్
భారత్కు ఆస్ట్రేలియా గండం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
![WTC Rankings : భారత్కు ఆస్ట్రేలియా గండం.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో టీమ్ఇండియాను వెనక్కినెట్టిన ఆసీస్ WTC Rankings : భారత్కు ఆస్ట్రేలియా గండం.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో టీమ్ఇండియాను వెనక్కినెట్టిన ఆసీస్](https://10tv.in/wp-content/uploads/2024/01/New-Project-20-1.jpg)
Australia reached no 1 spot in ICC World Test Championship points table
WTC Rankings : భారత్కు ఆస్ట్రేలియా గండం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు, వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచుల్లో టీమ్ఇండియాను ఓడించి కప్పులను గెలుచుకున్న ఆసీస్ తాజాగా 24 గంటల వ్యవధిలో భారత్కు డబుల్ షాక్లు ఇచ్చింది. టీమ్ఇండియాను వెనక్కి నెట్టి నిన్న టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరిన ఆస్ట్రేలియా నేడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది
సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టు మ్యాచులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0తో క్లీన్స్లీప్ చేయడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి మొదటి స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ 2023-2025 సైకిల్లో ఆస్ట్రేలియా 8 టెస్టులు ఆడింది. ఐదు మ్యాచుల్లో గెలవగా రెండు మ్యాచుల్లో ఓడింది. మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 54 పాయింట్లు ఉన్నాయి. 56.25 విజయశాతంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
24 గంటల వ్యవధిలోనే..
ఇక భారత జట్టు విషయానికి వస్తే కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచులో గెలిచిన భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే.. 24 గంటల వ్యవధిలోనే టాప్ ప్లేస్ను కోల్పోయింది. ఈ సైకిల్లో ఇప్పటి వరకు నాలుగు టెస్టు మ్యాచులు ఆడిన భారత్ రెండు మ్యాచుల్లో గెలిచింది. ఓ మ్యాచులో ఓడగా మరో మ్యాచ్ను డ్రాగా ముగించింది. భారత్ ఖాతాలో 26 పాయింట్లు ఉన్నాయి. 54.16 విజయ శాతంతో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఆ తరువాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లు అన్నింటి విజయ శాతం 50గా ఉంది. ఇక ఆస్ట్రేలియా చేతిలో 0-3తో టెస్టు సిరీస్ను కోల్పోయిన పాకిస్తాన్ 36.66 విజయశాతంతో ఆరో స్థానానికి పడిపోయింది. 16.67 విజయశాతంతో వెస్టిండీస్ ఏడు, 15 విజయశాతంతో ఇంగ్లాండ్ ఎనిమిది స్థానాల్లలో నిలిచాయి. ఇక ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక తొమ్మిదో స్థానంలో ఉంది.
కాగా.. మార్చి చివరి నాటికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు చేరుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఇక భారత్ అగ్రస్థానానికి చేరుకునేందుకు ఓ అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో జనవరి 25 నుంచి ఆరంభం కానున్న ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ గెలిస్తే భారత్ టాప్ ప్లేస్కు వెళ్లొచ్చు.