Telangana BJP : లోకసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చ.. కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్న ఢిల్లీ పెద్దలు
Telangana BJP : లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఢిల్లీ పెద్దలతో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను ఢిల్లీ పెద్దలు అడిగి తెలుసుకున్నారు.
Telangana BJP : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గెలుపు గుర్రాల కోసం క్షేత్రస్థాయి నుంచి నివేదికల ఆధారంగా తుది జాబితా ఖరారుపై దృష్టిపెడుతున్నారు. లోక్ సభ అభ్యర్థుల జాబితాపై బీజేపీ జోరును పెంచేసింది.
ఈ నేపథ్యంలోనే శనివారం (ఫిబ్రవరి 24న) ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నివాసంలో జేపీ నడ్డా, అమిత్ షాతో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై జేపీ నడ్డాతో సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చర్చ :
రాష్ట్రాల వారిగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వంతో బీజేపీ జాతీయ నాయకత్వం చర్చలు జరిపింది. ఇందులో ప్రధానంగా యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, చత్తీస్ గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోక్సభ అభ్యర్థులపై కసరత్తు గురించి కూడా చర్చకు వచ్చింది. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చర్చ కూడా జరిగింది.
ముందుగా బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో సమావేశమైన తెలంగాణ కోర్ కమిటీ అనంతరం జేపీ నడ్డాతో భేటీ అయింది. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ లోక్ సభ నియోజకవర్గాల ఆశావహుల జాబితాను కిషన్ రెడ్డి అధిష్టానానికి అందజేశారు.
అధిష్టానానికి అభిప్రాయాలను తెలియజేసిన రాష్ట్ర నేతలు :
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను జెపి నడ్డా, అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. నూతన నేతల చేరికలు, చేరే వారికి సీట్ల కేటాయింపు, ఆశావాహుల బలా బలాలు, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాల సహా అభ్యర్థుల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై అధిష్టానానికి తమ అభిప్రాయాలను రాష్ట్ర నేతలు తెలియజేశారు. ఢిల్లీ పెద్దలతో సమావేశం అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ రాత్రికి తెలంగాణ బీజేపీ నేతలు హైదరాబాద్ బయలుదేరనున్నారు.
Read Also : CM Revanth Reddy : ధరణిపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులపై ఆగ్రహం.. విచారణకు ఆదేశాలు