Rohit Sharma : ఎలైట్ కెప్టెన్ల జాబితాలో రోహిత్ స్థానం సంపాదిస్తాడా?
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది.
![Rohit Sharma : ఎలైట్ కెప్టెన్ల జాబితాలో రోహిత్ స్థానం సంపాదిస్తాడా? Rohit Sharma : ఎలైట్ కెప్టెన్ల జాబితాలో రోహిత్ స్థానం సంపాదిస్తాడా?](https://10tv.in/wp-content/uploads/2024/03/New-Project-4.jpg)
Rohit Sharma Close To Joining Dhoni Virat Kohli In Elite List
Rohit Sharma – IND vs ENG 5th : ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఆఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ కూడా కుర్రాళ్లతో కూడిన జట్టును రోహిత్ శర్మ అద్భుతంగా నడిపిస్తున్నాడు. కాగా.. రోహిత్ శర్మను ప్రస్తుతం ఓ రికార్డు ఊరిస్తోంది.
మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న టెస్టు మ్యాచ్లో గనుక రోహిత్ సారథ్యంలోని టీమ్ఇండియా విజయం సాధిస్తే ఎలైట్ కెప్టెన్ల జాబితాలో హిట్మ్యాన్ చోటు దక్కించుకుంటాడు. టెస్టుల్లో టీమ్ఇండియాకు 10 విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్ స్థానం సంపాదిస్తాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో నలుగురు మాత్రమే ఉన్నారు. మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి లు మాత్రమే ఈ ఎలైట్ జాబితాలో ఉన్నారు.
అత్యధికంగా కోహ్లి సారథ్యంలో టీమ్ఇండియా టెస్టుల్లో 40 మ్యాచుల్లో గెలవగా ఎంఎస్ ధోని నాయకత్వంలో 27 మ్యాచుల్లో విజయం సాధించింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 21, మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వంలో 14 మ్యాచుల్లో గెలిచింది. రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ లు తలా 9 విజయాలతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. ధర్మశాలలో భారత్ గెలిస్తే.. 10 విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్ చోటు దక్కించుకోనున్నాడు.
మరో 121 పరుగులు చేస్తే..
టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించనున్నాడు. టెస్టుల్లో అతడు మరో 121 పరుగులు చేస్తే టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ను అతడు అధిగమిస్తాడు. గంభీర్ 58 టెస్టుల్లో 4154 పరుగులు చేశాడు. ఇక రోహిత్ 58 మ్యాచుల్లో 4034 పరుగులతో చేశాడు.