SBI Electoral Bonds : సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు దిగొచ్చిన ఎస్బీఐ.. ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నీ ఎన్నికల సంఘం చేతుల్లోకి..!
SBI Electoral Bonds : ఈ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మార్చి 15 (మంగళవారం) సాయంత్రం 5 గంటలలోగా తమ వెబ్సైట్లో ఏ రాజకీయ పార్టీకి ఎవరి ద్వారా ఎంత విరాళాలు వచ్చాయో కేంద్ర ఎన్నికల సంఘం పొందుపరచనుంది.
SBI Electoral Bonds : సుప్రీంకోర్టు ఆదేశానుసారం.. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఎట్టకేలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగొచ్చింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం డేటాను మంగళవారం సాయంత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) ఎన్నికల సంఘానికి అందించింది. సుప్రీంకోర్టుకు ఆదేశాలకు అనుగుణంగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ తమకు అందజేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
Read Also : KCR : కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, సమైక్య పాలకులే నయం, నేను గెలిచుంటే దేశంలో అగ్గి రాజేసేవాడిని- కేసీఆర్
మార్చి 15 సాయంత్రంలోగా వెబ్సైట్లో ఎలక్టోరల్ బాండ్ల డేటా :
అయితే, ఈ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మార్చి 15 (మంగళవారం) సాయంత్రం 5 గంటలలోగా తమ వెబ్సైట్లో ఏ రాజకీయ పార్టీకి ఎవరి ద్వారా ఎంత విరాళాలు వచ్చాయో కేంద్ర ఎన్నికల సంఘం పొందుపరచనుంది. మార్చి 12 సాయంత్రం వరకు ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీకి సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఎస్బీఐ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల డేటాను మార్చి 12న ఎన్నికల కమిషన్కు అందించిందని పోల్ ప్యానెల్ ప్రతినిధి ఎక్స్ వేదికగా తెలిపారు. ఎస్బీఐ 2018లో స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి 30 విడతల్లో రూ. 16,518 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసింది. అయితే, ఈ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలకు సంబంధించి జూన్ 30 వరకు గడువును పొడిగించాలని ఎస్బీఐ పిటిషన్ వేయగా.. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. మార్చి 12న వర్కింగ్ అవర్స్ ముగిసేలోగా ఎన్నికల కమిషన్కు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అందజేయాలని ఆదేశించింది.
In compliance of Hon’ble Supreme Court’s directions to the SBI, contained in its order dated Feb 15 & March 11, 2024 (in the matter of WPC NO.880 of 2017), data on electoral bonds has been supplied by State Bank of India to Election Commission of India, today, March 12, 2024.
— Spokesperson ECI (@SpokespersonECI) March 12, 2024
జూన్ 30 వరకు గడువు కోరిన ఎస్బీఐ :
గత 26 రోజులలో మీరు ఏ చర్యలు తీసుకున్నారని ఎస్బీఐని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల కమిషన్కు సమర్పించడానికి సమయం కావాలని సుప్రీంకోర్టుకు ఎస్బీఐ తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఈసీకి వెల్లడించడానికి జూన్ 30 వరకు సమయం కోరుతూ ఎస్బీఐ చేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారంలోగా అన్ని వివరాలను వెల్లడించాలని నేషనల్ బ్యాంకును ఆదేశించింది.
గత నెలలో స్కీమ్ రద్దు చేయడానికి ముందు రాజకీయ పార్టీలు ఎన్క్యాష్ చేసిన ప్రతి ఎలక్టోరల్ బాండ్ వివరాలను వెల్లడించడానికి గడువు కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా, ఎస్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సమర్పణలను బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించి బ్యాంకు ఇతర బ్రాంచ్లలోని వివరాలను సేకరించి, సరిపోల్చడానికి మరింత సమయం అవసరమని ఎస్బీఐ తరఫు వాదనలు వినిపించాయి.