Rishabh Pant : రెండు నెలలు బ్రష్ చేసుకోలేకపోయా.. కారు ప్రమాదం తరువాత ఏడు నెలలు నరకం
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సుదీర్ఘ విరామం తరువాత మైదానంలో అడుగుపెట్టి ఐపీఎల్లో అదరగొట్టాడు.
Pant : టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సుదీర్ఘ విరామం తరువాత మైదానంలో అడుగుపెట్టి ఐపీఎల్లో అదరగొట్టాడు. 13 ఇన్నింగ్స్ల్లో 155 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 446 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ జట్టులోనూ స్థానం సంపాదించుకున్నాడు. తన ఫామ్ను టీ20 ప్రపంచకప్లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు.
2022 డిసెంబర్లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో తాను అనుభవించిన బాధను తాజాగా పంత్ గుర్తు చేసుకున్నాడు. రెండు నెలల పాటు పళ్లు కూడా తోముకోలేని విధంగా తన పరిస్థితి ఉండేదని చెప్పాడు. జియో సినిమాస్లో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ హోస్ట్ చేసిన టాక్ షో ‘ధావన్ కరేంగే’ రెండవ ఎపిసోడ్లో పంత్ మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నాడు.
రోడ్డు ప్రమాదం తన జీవితాన్ని ఎంతో మార్చిందని చెప్పాడు. తీవ్రమైన గాయాలు కావడంతో తాను ప్రాణాలతో ఉంటానో లేదోనని అనిపించిందని తెలిపాడు. ఏడు నెలల పాటు తీవ్రమైన నొప్పిని అనుభవించానని, నరకంగా అనిపించిందన్నాడు. దాదాపు రెండు నెలల పాటు బ్రష్ కూడా చేసుకోలేకపోయానన్నాడు. ఇక వీల్ ఛైర్లో ఉండే వ్యక్తులను చూస్తే తనకు ఇబ్బందిగా అనిపించేందని అందుకనే ఎయిర్పోర్టుకు వెళ్లలేకపోయానని చెప్పాడు. మొత్తానికి దేవుడు తనను రక్షించాడని రిషబ్ తెలిపాడు.
గాయం నుండి కోలుకునేటప్పుడు ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమన్నాడు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్లు అనేక రకాల విషయాలను చెబుతూ ఉంటారు. అయితే.. ఓ వ్యక్తిగా మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నాడు. తనకు ఇది పునర్మజన్మలాంటిది అని భావిస్తున్నాట్లు చెప్పాడు. క్రికెట్లో పునరాగమనం పై మాట్లాడుతూ ఒత్తిడి కంటే ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు. ఇక తాను క్రికెటర్ కావాలనేది తన తండ్రి కల అని. దాన్ని నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించాడు.