తెలంగాణలో ఆ ఐదు జిల్లాల్లో ఇవాళ అతిభారీ వర్షాలు.. కీలక హెచ్చరికలు చేసిన వాతావరణ శాఖ
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. సోమవారం కూడా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rainfall : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి 10గంటల వరకు నగరంలో సగటున 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని నగర వాసులకు సూచించారు. సోమవారం కూడా హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. హుస్సేన్ సాగర్ గరిష్ఠ స్థాయి నీటి సామర్థ్యం 514.75 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.210 మీటర్ల మేర ఉందని అధికారులు తెలిపారు. సోమవారం కూడా నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Also Read : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు దగ్దం
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. సోమవారం కూడా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదేవిధంగా అదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమురం భీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, పెద్దపల్లి, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : హైదరాబాద్లో వర్ష బీభత్సం.. వరదలో చిక్కుకున్న కారు, ప్రాణాలకు తెగించి కారులో ఉన్నవారిని కాపాడిన స్థానికులు
తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే కాకుండా.. వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదని వాతావరణ శాఖ తెలిపింది.