బీఆర్ఎస్‌ను తిడితేనో, ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు- సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్

రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను..

బీఆర్ఎస్‌ను తిడితేనో, ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు- సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్

Harish Rao : వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించడం లేదనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని ధ్వజమెత్తారు. అబద్దం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని ఫైర్ అయ్యారు హరీశ్ రావు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడకపోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద, నా మీద అవాకులు చెవాకులు పేలారని సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు హరీశ్ రావు.

”అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారు. ఆగస్టు 15వ తేదీ వరకు 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఊదరగొట్టారు. అంటే 9 వేల కోట్లు కోత పెట్టారు. అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేశారు. సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజస్వరూపాన్ని ఈరోజు బట్టబయలు చేసుకున్నారు సీఎం రేవంత్.

మేము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17 వేల కోట్లు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? 17,869 కోట్లు మాత్రమే అవుతాయా? ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది. మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలి? నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్ఎస్ ను తిడితేనో, తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు.

రేవంత్ రెడ్డి.. రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పి మీరు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ, మీకు ఆ సంస్కారం లేదు. మీలో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, మీరు చేసిన పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్నా.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు గాను, దైవ ద్రోహానికి గాను తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా. ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పాడో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో నేనే స్వయంగా పోతా. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను” అని హరీశ్ రావు అన్నారు.

Also Read : రాజీనామా చెయ్, సిద్ధిపేటలో ఎలా గెలుస్తావో చూస్తా..! హరీశ్ రావుకి సీఎం రేవంత్ సవాల్