ఎంత పని చేశావమ్మా..! ఐఏఎస్ అధికారి అత్యుత్సాహంతో చిక్కుల్లో రేవంత్ సర్కార్..! అసలేం జరిగిందంటే..
ఇదిలాఉంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా సెంట్రల్ జీఎస్టీ అధికారులు... రాష్ట్ర ప్రభుత్వం వెంట పడుతున్నారు. ఎగవేసిన 1400 కోట్ల రూపాయల్లో సగం కేంద్రానికి వస్తుందనే ఆలోచనతో ఎగవేతదారుల పేర్లు చెప్పాలని సెంట్రల్ జీఎస్టీ అధికారులు కోరుతున్నారట.
![ఎంత పని చేశావమ్మా..! ఐఏఎస్ అధికారి అత్యుత్సాహంతో చిక్కుల్లో రేవంత్ సర్కార్..! అసలేం జరిగిందంటే.. ఎంత పని చేశావమ్మా..! ఐఏఎస్ అధికారి అత్యుత్సాహంతో చిక్కుల్లో రేవంత్ సర్కార్..! అసలేం జరిగిందంటే..](https://10tv.in/wp-content/uploads/2024/08/Gossip-Garage-Ias-Officer-Sridevi-Issue.jpg)
Gossip Garage : తెలంగాణ సర్కారులో ఓ ఐఏఎస్ తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి లాభం చేస్తున్నాననే ఆలోచనతో దూకుడు చూపిన ఆ ఐఏఎస్ వల్ల ప్రభుత్వానికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెతలా రాష్ట్ర ప్రభుత్వమే చుక్కలు లెక్కిస్తోందట. ఏదో అనుకుంటే ఇంకేదో అవ్వడంతో ఆ ఐఎఎస్ కూడా అయ్యా ఎస్ అనాల్సి వస్తోందంటున్నారు.
సెంట్రల్ జీఎస్టీ ఎంట్రీతో తలలు పట్టుకున్న అధికారులు..
తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యగా మారింది. రాష్ట్రానికి చెందిన కొన్ని సంస్థలు 1400 కోట్ల రూపాయలకుపైగా జిఎస్టీ ఎగవేతకు పాల్పడ్డినట్లు వాణిజ్యశాఖ అనుమానం వ్యక్తం చేసింది. మొత్తం 11 సంస్థలు ఎగవేతకు పాల్పడినట్లు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవి గుర్తించారు. దీంతో జాయింట్ కమిషనర్ రవితో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దాదాపు 1400 కోట్ల పన్ను ఎగవేత అనగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే యాక్షన్లోకి దిగింది. సీఐడీకి కేసును అప్పగించింది.
సీఐడీ అసలు బాగోతాన్ని తేల్చే పనిలో పడింది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర జీఎస్టీ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వర రావు, జాయింట్ కమిషనర్ శివరాం ప్రసాద్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు లపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఇలా ఈ కేసుపై సీఐడీ కూపీ లాగుతుండగానే సెంట్రల్ జీఎస్టీ ఎంట్రీ ఇచ్చింది. ఎగవేత మొత్తంలో సగం తమకు రావాలని.. పన్ను ఎగవేతదారుల పేర్లు ఇవ్వాలని లేఖ రాసింది. ఇక్కడే అసలు ట్విస్టు బయటపడటంతో ప్రభుత్వ పెద్దలు… అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఆధారాలు ఏమీ లేవని చెప్పడంతో కంగుతిన్న పోలీసులు..
భారీ మొత్తంలో పన్ను ఎగవేశారని ఫిర్యాదు చేసిన జాయింట్ కమిషనర్ రవిని సీఐడీ విచారించగా, తన వద్ద ఆధారాలు ఏమీ లేవని ఆయన చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారంటున్నారు. తనకు అప్పటి కమిషనర్ శ్రీదేవి చెబితేనే ఫిర్యాదు చేశానని.. అంతకుమించి తనకేం తెలియదని జాయింట్ కమిషనర్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. పూర్తి సమాచారం లేకుండానే కేవలం అనుమానంతో కేసు పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు సైతం గుర్రుగా ఉన్నారంటున్నారు. పైగా పన్ను ఎగవేశారని ఐఏఎస్ అధికారి టీకే శ్రీదేవి అనుమానం వ్యక్తం చేసిన సంస్థల్లో కొన్ని ప్రభుత్వ సంస్థలూ ఉండటంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు పోలీసులు.
దీనికి ఎవరిని బాధ్యులు చేయాలన్న విషయంపై పోలీసులు తర్జనభర్జన పడుతుండగా, ఐఎఎస్ అధికారి అత్యుత్సాహంతో కేంద్ర సంస్థల వద్ద బుక్కైపోయామని రాష్ట్ర అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్, ట్రాన్స్కో, ఎల్.ఐ.సీ, ఎన్.ఎమ్.డి.సీతో పాటు పలు సంస్థలు జీఎస్టీ ఎగవేసినట్లు కేసు పెట్టడం ప్రభుత్వానికి సైతం ఆగ్రహం తెప్పించిందంటున్నారు. దీంతో ఐఎఎస్ అధికారి శ్రీదేవిని అప్రధాన్య పోస్టుకు బదిలీ చేసింది ప్రభుత్వం.
ప్రభుత్వం పరువు పోతుందని టెన్షన్..
ఇదిలాఉంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా సెంట్రల్ జీఎస్టీ అధికారులు… రాష్ట్ర ప్రభుత్వం వెంట పడుతున్నారు. ఎగవేసిన 1400 కోట్ల రూపాయల్లో సగం కేంద్రానికి వస్తుందనే ఆలోచనతో ఎగవేతదారుల పేర్లు చెప్పాలని సెంట్రల్ జీఎస్టీ అధికారులు కోరుతున్నారట. దీంతో ఎవరి పేర్లు సూచించాలో తెలియక ప్రభుత్వం తర్జనభర్జన పడుతోందంటున్నారు. తమ వద్ద ఆధారాలు లేవంటే ప్రభుత్వం పరువు పోతుందని టెన్షన్ పడుతున్న అధికారులు… ఈ గండం నుంచి బయపడే మార్గాలను అన్వేషిస్తున్నారు.
Also Read : అసంతృప్తితో రగిలిపోతున్న ఆ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ సడెన్గా ఎందుకు సైలెంట్ అయ్యారు? కారణం అదేనా..