గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 'స్టే' విధించింది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

Supreme Court

governor quota mlc: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి బుధవారం సుప్రీంకోర్టు ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం ‘స్టే’ విధించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడమన్నది ప్రభుత్వ విధి అని పేర్కొంది.

తమ నియామకాన్ని పక్కన పెట్టి, కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్‌ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరలే సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం, గవర్నర్‌ ఎలాంటి చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

కాగా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ నియామకాలను గవర్నర్ పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ఆమోదం తెలిపారు. వీరిద్దరి నియామకంలో గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ నియామక గెజిట్ కొట్టివేస్తూ.. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకంపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు సుప్రీంకోర్టు స్టే విధించింది.