Hanuman Jayanti 2022 : మే 29న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌ పారాయ‌ణం

హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో చివ‌రిరోజైన మే 29వ తేదీ ఆదివారం తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగుతుందని టీటీడీ ప్రకటించింది.

Hanuman Jayanti 2022 : మే 29న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌ పారాయ‌ణం

Dharmagiri Tirumala

Hanuman Jayanti 2022 :  హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో చివ‌రిరోజైన మే 29వ తేదీ ఆదివారం తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగుతుందని టీటీడీ ప్రకటించింది. ఉద‌యం 6 గంట‌ల నుండి అర్ధ‌రాత్రి వ‌ర‌కు దాదాపు 18 గంట‌ల పాటు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

హ‌నుమంతుడు సీతాన్వేష‌ణ కోసం లంక‌కు వెళ్లి సీత‌మ్మ జాడ తెలుసుకుని శ్రీ‌రామ‌చంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2,808 శ్లోకాల‌ను పండితులు పారాయ‌ణం చేస్తారు. హ‌నుమంతుడు విశ్రాంతి లేకుండా రామ‌కార్యం కోసం వెళ్లిన విధంగా పండితులు నిరంత‌రాయంగా సంపూర్ణ సుంద‌ర‌కాండ‌ను పారాయ‌ణం చేస్తారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.

కాగా, హ‌నుమ‌జ్జ‌యంతిని పుర‌స్క‌రించుకుని శుక్రవారం ఆకాశ‌గంగ, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు అల‌రించాయి. ఉద‌యం ఆకాశ‌గంగ‌లోని శ్రీ అంజ‌నాదేవి, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి నిర్వ‌హించిన స్న‌ప‌న‌తిరుమంజ‌నం కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు పాల్గొన్నారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై సాయంత్రం 4 గంట‌ల‌కు “వీరో హ‌నుమాన్ క‌పిః” అనే అంశంపై డా.ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌ ఉప‌న్య‌సించారు.

ఆకాశ‌గంగలో ఉదయం 10 నుండి 11 గంటల వ‌ర‌కు జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం స‌హాయ ఆచార్యులు డా. త‌నూజ విష్ణువ‌ర్ధ‌న్‌ శ్రీ హ‌నుమ అవ‌తార ఘ‌ట్టంపై ఉప‌న్య‌సించారు. ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ‌మ‌తి క‌విత‌, శ్రీ‌మ‌తి లావ‌ణ్య, శ్రీ ఉద‌య‌భాస్క‌ర్ బృందం శ్రీ హ‌నుమాన్ చాలీసా, శ్రీ‌రామ, శ్రీ హ‌నుమ సంకీర్త‌న‌లు ఆల‌పించారు.

మ‌ధ్యాహ్నం 12 నుండి 1 గంట వ‌ర‌కు ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ ఎల్‌.జ‌య‌రామ్ ప‌లు భ‌క్తి సంకీర్త‌న‌లను భావ‌యుక్తంగా గానం చేశారు. మ‌ధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు శ్రీమ‌తి పి.స్ర‌వంతి హ‌రిక‌థ వినిపించారు. మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌రకు దాస సాహిత్య ప్రాజెక్టు భ‌జ‌న బృందం క‌ళాకారులు హ‌నుమంతుని వైభ‌వంపై సంకీర్త‌న‌లు గానం చేశారు. ప్రోగ్రాం అసిస్టెంట్‌ శ్రీ పురుషోత్తం ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.

జ‌పాలి శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు భ‌జ‌న బృందం క‌ళాకారులు హ‌నుమంతుని వైభ‌వంపై సంకీర్త‌న‌లు గానం చేశారు. ఉద‌యం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ వై.వేంకటేశ్వ‌ర్లు హ‌రిక‌థ వినిపించారు. మ‌ధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌రకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీమ‌తి క‌విత‌, శ్రీ‌మ‌తి లావ‌ణ్య బృందం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల‌ వ‌ర‌కు ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ ఎల్‌.జ‌య‌రామ్ బృందం ప‌లు భ‌క్తి సంకీర్త‌న‌లు ఆల‌పించారు.

Also Read : Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు