రైతుల ఖాతాల్లోకి మరో విడత రైతు భరోసా సాయం
cm ys jagan launch second term raithu barosa today : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు భరోసా సాయాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును సీఎం జగన్ అందచేస్తున్నారు.
రబీ సీజన్కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ఆర్ఓఎఫ్ఆర్) రైతులకూ రైతు భరోసా అందుతుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చింది.
2019 అక్టోబర్ 15న సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించనున్నారు. అక్టోబర్ 27, మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి అందించే మరో విడత రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేయనున్నారు.
పెరిగిన లబ్దిదారుల సంఖ్య
వాస్తవ సాగుదార్లందరికీ రైతు భరోసా అందించాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడు వచ్చిన వినతులను పరిష్కరిస్తుండడంతో ఈసారి లబ్ధిదారుల సంఖ్య 50,47,383కి చేరింది. 2019 అక్టోబర్లో లబ్ధిదారుల సంఖ్య 46,69,375 మంది మాత్రమే కాగా 2020 మే నెలలో ఖరీఫ్ సమయంలో ఈ సంఖ్య 49,45,470కి చేరింది. ఇప్పుడు రబీలో ఏకంగా 50,47,383కి చేరింది. అంటే ఖరీఫ్తో పోల్చుకుంటే మరో 1,01,913 మంది కొత్తగా సాయం పొందనున్నారు. 50,47,383 మంది లబ్ధిదారులకు గాను రూ.1,114.87 కోట్ల సాయం అందనుంది.