ప్రకాశం : కురిచేడు ఘటనలో కొత్త కోణం..యూట్యూబ్ చూసి శానిటైజర్ తయారుచేశాడు

  • Published By: nagamani ,Published On : August 10, 2020 / 01:02 PM IST
ప్రకాశం : కురిచేడు ఘటనలో కొత్త కోణం..యూట్యూబ్ చూసి శానిటైజర్ తయారుచేశాడు

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో ఓ కొలిక్కి వచ్చిన విచారణలో కొత్తకోణాలు బైటపడ్డాయి. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని హైదరాబాద్ లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



వీరిలో శానిటైజర్ కంపెనీ ‘పర్ఫెక్ట్’ యజమాని శ్రీనివాస్ కూడా ఉన్నాడు. సొంత తెలివితేటలు ఉపయోగించి 16మందికి కారణమైన శ్రీనివాసరావుని అధికారులు విచారిస్తున్నారు. శానిటైజర్ సరఫరా చేసిన నలుగురు ఇద్దరు మార్వాడీలు, మరో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. శనివారం (ఆగస్టు 9,2020) తెల్లవారుజామున వీరిని కురిచేడుకు తీసుకొచ్చారు. ఒకట్రెండు రోజుల్లో వీరిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.



ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శానిటైజర్ కంపెనీ యజమాని శ్రీనివాస్ కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అతను ఒక కిరాణా షాపులో పని చేశాడు. ఆ తర్వాత పర్ఫెక్ట్ కిరాణా మర్చెంట్స్ పేరుతో ఒక దుకాణాన్ని తెరిచాడు. లాక్ డౌన్ సమయంలో శానిటైజర్లు, మాస్కులు కూడా అమ్మేవాడు. వ్యాపారం బాగుండటంతో… సొంతంగా శానిటైజర్ల తయారీ కూడా మొదలుపెట్టేశాడు. కరోనా రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో శ్రీనివాస్ వ్యాపారం కూడా జోరందుకుంది. కాసులు బాగా కురుస్తుండటంతో డబ్బుల ఆశ బాగా పెరిగింది. కరోనాను బాగా క్యాష్ చేసుకుందామనుకున్నాడు.



‘పర్ఫెక్ట్’ శానిటైజర్ పేరుతో ఏకంగా శానిటైజర్ తయారీని ప్రారంభించేశాడు. దీనికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు కూడా లేవు. శానిటైజర్ తయారీలో వాడాల్సిన ఇథైల్ ఆల్కహాల్ బదులు మిథైల్ క్లోరైడ్ ను వాడటం పెద్ద ఘోరానికి దారి తీసింది. మిడి మిడి జ్ఞానంతో డబ్బుల ఆశతో అతను చేసిన తప్పు ఘోరంగా 16మంది ప్రాణాల్ని బలిగొంది.



జనాలు ప్రాణాలు కోల్పోవడానికి ఇదే కారణమనని పోలీసులు స్వాధీనం చేసుకున్న టెస్ట్ ల ద్వారా నిర్ధారించారు. కురిచేడులో కొన్ని మెడికల్ షాపులకు మాత్రమే శానిటైజర్లు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ మెడికల్ షాపులకు శానిటైజర్లు పంపిణీ చేసినట్టు విచారణలో తెలిసింది. దీంతో ‘పర్ఫెక్ట్’ శానిటైజర్ యజమాని శ్రీనివాస్ తో పాటు అతనికి ముడిసరుకు అందించిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.



కాగా లాక్ డౌన్ లో మద్యం దొరక్క కిక్కు కోసం ప్రకాశం జిల్లాలో చాలామంది ఈ శానిటైజర్ తాగి 16మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన తీవ్ర సంచలనం కావటంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని బైటపెట్టారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.