9నెలల తర్వాత దొరికింది, రూ.4లక్షల లంచం కేసులో ఎమ్మార్వో హసీనాబీ అరెస్ట్

  • Published By: naveen ,Published On : July 25, 2020 / 11:03 AM IST
9నెలల తర్వాత దొరికింది, రూ.4లక్షల లంచం కేసులో ఎమ్మార్వో హసీనాబీ అరెస్ట్

ఎట్టకేలకు ఆ అవినీతి తహశీల్దార్ దొరికింది. 9 నెలలుగా పరారీలో ఉన్న ఆమెని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.4లక్షల లంచం కేసులో తప్పించుకుని తిరుగుతున్న కర్నూలు జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2019 నవంబర్ లో హసీనా బీని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. ఓ రైతు నుంచి రూ.4లక్షలు లంచం తీసుకుంటూ హసీనా బీ సన్నిహితుడు అలీ ఏసీబీకి పట్టుబడ్డాడు. అప్పటి నుంచి తహశీల్దార్ పరారీలో ఉంది. గూడురులోని సాయిబాబానగర్ లో హసీనా బీ ఉందన్న సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు ఆమెని పట్టుకున్నారు. సుమారు 8 నెలల పాటు హసీనా బీ ఏసీబీ అధికారులను ముప్పతిప్పలు పెట్టింది.

భూమి పని కోసం రూ.8లక్షలు లంచం డిమాండ్:
2019 నవంబర్ 7న ఓ రైతు నుంచి రూ.8లక్షలు లంచం డిమాండ్ చేసి వార్తల్లో నిలిచారు తహశీల్దార్ హసీనా బీ. ఓ వ్యక్తి భూమికి సంబంధించి ఆమె లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.4లక్షలకు ఆ వ్యక్తితో బేరం కుదుర్చుకుంది. కాగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో తహశీల్దార్ బాగోతం బట్టబయలైంది. కోర్టు ఆర్డర్ ప్రకారం పొలం రెవెన్యూ అడంగల్ లో రెడ్ మార్కు తొలగించడానికి లంచం డిమాండ్ చేసింది తహశీల్దార్.

హసీనా బీ తన బినామీ అయిన హుస్సేన్ అనే వ్యక్తితో లావాదేవీలు జరుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఏసీబీ వేసిన స్కెచ్ లో హుస్సేన్ పట్టుబడ్డాడు. దీంతో హసీనా బీ పరార్ అయ్యింది. అధికారులు బృందాలుగా విడిపోయి తీవ్రంగా గాలించినా హసీనా ఆచూకీ దొరకలేదు. చివరికి అధికారులు ప్రయత్నం ఫలించింది.

అసలేం జరిగిందంటే:
కర్నూలు జిల్లా గూడూరులో షేక్‌ హసీనాబీ ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తోంది. సురేష్ అనే రైతు తన పొలానికి సంబంధించిన సమస్యపై ఎమ్మార్వోను కలవగా.. ఆమె లంచం డిమాండ్ చేసింది. రూ.8 లక్షలు ఇస్తేనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పింది. అంత డబ్బు ఇవ్వలేనన్న సురేష్.. రూ.4 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. తర్వాత రైతు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. నవంబర్ 7న హసీనాబి తన సోదరుడు బాషాను లంచం తీసుకునేందుకు పంపింది. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు.. సురేష్ అతడికి లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.

9 నెలలుగా పరారీలో:
బాషా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడని తెలియడంతో హసీనాబీ కనిపించుకుండాపోయింది. తర్వాత ఆమె సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా హసీనాబా కర్నూలులోని సీ.క్యాంప్‌లోని ఓ క్వార్టర్‌లో ఉంటున్నట్టు గుర్తించారు. తాళం వేసి ఉన్న ఓ క్వార్టర్‌లో ఆమె నివాసం ఉంటున్నట్టు తెలిసింది. అధికారులు అక్కడికి వెళ్లేసరికి హసీనాబీ జారుకుంది. రెవెన్యూ అధికారుల సమక్షంలో తలుపు పగలగొట్టి చూడగా.. ఓ వ్యక్తితో హసీనాబీ దిగిన ఫొటోలు కనిపించాయి. అతణ్ని కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్యగా గుర్తించారు. గిడ్డయ్యతో హసీనాబీ సహజీవనం చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.