తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో బీజేపీ

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో బీజేపీ

Janasena

Tirupati Lok Sabha : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉంటాడా ? లేక జనసేన క్యాండిడేట్ ఉంటాడా ? అనే ఉత్కంఠకు తెరపడింది. పోటీపై ఇరు పార్టీలు స్పష్టతనిచ్చాయి. ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉండనున్నారు. ఈ ఎన్నికపై జనసేన అధినేత పవన్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, సునీల్ దియేధర్ లు చర్చించారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం బీజేపీ ప్రకటన చేసింది.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ప్రజాప్రతినిధి మరణిస్తే….ఉప ఎన్నికలో పోటీ చేయకూడదన్న సంప్రదాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాటించడం లేదు. అన్ని పార్టీలూ ఉప ఎన్నికల బరిలో నిలస్తున్నాయి. తిరుపతిలోనూ ఉప ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ అందరికన్నా ముందుగా ఉప ఎన్నిక అభ్యర్ధిని ప్రకటించి షాకిచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే మళ్లీ బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు.

టీడీపీ అభ్యర్ధిని ప్రకటించిన కొన్ని రోజులకే అధికార వైసీపీ కూడా అనూహ్యంగా ఉప ఎన్నిక బరిలో కొత్త అభ్యర్ధిని నిలుపుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తిరుపతి టికెట్ బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్‌ చక్రవర్తికి వస్తుందని అందరూ భావించారు. కానీ కళ్యాణ్‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి….తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తికి టికెట్ కేటాయించారు సీఎం జగన్‌. ఈ క్రమంలో బీజేపీ – జనసేన పార్టీలపై దృష్టి నెలకొంది. తిరుపతి ఉప ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది బీజేపీ. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచినట్టుగానే…ఏపీలో తిరుపతి ఎంపీ స్థానంలో గెలుపొంది పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మిత్రపక్షమైన జనసేన తిరుపతి టిక్కెట్ కోసం పట్టుబడుతున్నప్పటికీ బీజేపీ.. సొంత అభ్యర్ధిని పోటీలో నిలబెట్టడానికే ఆసక్తి చూపుతోంది.

గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కపోయినప్పటికీ…ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో కాషాయ జెండాను రెపరెపలాడించడం…అంత కష్టం కాదన్నది బీజేపీ అభిప్రాయం. అయితే..జనసేన అభ్యర్థి నిలబడుతాడని తొలుత ప్రచారం జరిగింది. ఏ అభ్యర్థి నిలబడితే బాగుంటుందనే దానిపై ఇరు పార్టీలు పలు దఫాలుగా చర్చించాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…తమ అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ అవగాహనకు రాగా..మూడో పక్షంగా ఉన్న జనసేన- బీజేపీ విషయంలో సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం బీజేపీ పోటీ చేస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే..బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ఏడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.