దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 08:18 AM IST
దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి

బీజేపీ అధికార ప్రతినిధి పురిగెళ్ల రఘురాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని అనుకుంటున్న వారికి ఓ సూచన చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వం నచ్చి.. దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి అని ఆయన సూచించారు. అంతేకాని.. కేసుల నుంచి తప్పించుకోవడానికో, సొంత ప్రయోజనాల కోసమో బీజేపీలో చేరొద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎవరికీ పునరావాస కేంద్రం కాదని స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో బీజేపీలో చేరేందుకు పలువురు నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. టీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కాషాయం కండువా కప్పుకున్నారు. సాధినేని యామిని సైతం కాషాయం గూటికి చేరారు. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటు తెలంగాణలో మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో రఘురాం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

కేసుల నుంచి తప్పించుకోవడానికి, అవినీతి కప్పిపుచ్చుకోవడానికి.. నేతలు బీజేపీలో చేరుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలకు ఆజ్యం పోస్తూ రఘురాం చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి అలా అన్నారో కానీ.. ఆయన మాటలు మాత్రం మంటలు పుట్టిస్తున్నాయి.

Also Read : ఎర్ర జెండా ఎగరేశారు : ఇక మూడో ప్రపంచ యుద్ధమే..?