ప్రేమ పేరుతో మోసాలు.. అభాగ్యులుగా మిగిలిపోతున్న అమ్మాయిలు

ప్రేమ పేరుతో మోసాలు.. అభాగ్యులుగా మిగిలిపోతున్న అమ్మాయిలు

స్నేహమంటూ దగ్గరవుతున్నారు. ప్రేమంటూ వెంటపడుతున్నారు. పెళ్లి చేసుకుందామంటూ శారీరకంగా వాడేసుకుంటున్నారు. ఆ తర్వాత అవసరం లేదంటూ గెంటేస్తున్నారు. ప్రియురాలిని పక్కన పెట్టేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతున్నారు. సీన్‌కట్‌ చేస్తే.. న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా ఐదుకు పైగా ఘటనలు. తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.



ప్రేమ అనే ముసుగులో మోసపోతున్న అమ్మాయిల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పెళ్లి చేసుకుందామని శారీరకంగా వాడుకుని వదిలేసే వాళ్లు కొందరైతే…పెళ్లి చేసుకున్నాక గర్భవతి చేసి వదిలేసే వాళ్లు మరికొందరు.. ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. నమ్మించి, మాయమాటలు చెప్పి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఫలితంగా…ప్రియుడి చేతిలో మోసపోయిన కొందరు ధర్నాలు చేస్తుంటే..మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు రోజుల వ్యవధిలో…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివే నాలుగైదు ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇదిగో ఇక్కడ తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించిన ఈ యువతి పేరు మనీషా. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకొని వదిలేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. చిత్తురు జిల్లా బి. కొత్తకోట మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌…అదే గ్రామానికి చెందిన మనీషా ప్రేమించుకున్నారు. జూన్ నెల 15న కోసూవారిపల్లి శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు కాపురం చేసిన అతగాడు…కట్నం పేరుతో మనీషాని వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయానని.. తనకు న్యాయం చేయాలంటూ బి.కొత్తకోట పోలీసులను ఆశ్రయించింది.



విశాఖలో ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం ఒడిశా రాయ్‌పూర్ నుంచి విశాఖ వచ్చిన వైష్ణవి షణ్ముక తేజతో ప్రేమలో పడింది. మూడేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమాయణం కాస్తా ప్రియుడి తల్లిదండ్రుల వద్దకు చేరింది. పెళ్లి విషయం మాట్లాడేందుకు ప్రియుడి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది యువతి. పెళ్లికి ప్రియుడి తల్లిదండ్రులు నిరాకరించడం, ప్రియుడు కూడా ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురై…అపార్ట్‌మెంట్‌ నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది.

ఇక ఇటు…ఖమ్మం జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. శారీరకంగా వాడుకుని పెళ్లి మాట ఎత్తేసరికి మొహం చాటేశాడంటూ ధర్నా చేపట్టింది. కామేపల్లి మండలం గోవింద్రల గ్రామానికి చెందిన శివ.. అదే గ్రామానికి యువతి ప్రేమించుకున్నారు. ప్రేమంటూ వెంటపడ్డ శివ..పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడు. చివరకు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే నీతో అవసరం లేదంటూ పొమ్మన్నాడు.



దాంతో బాధిత యువతి చేసేదేమి లేక.. తల్లిదండ్రులు, గ్రామస్థులతో కలిసి ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి గర్భవతిని చేసి వదిలేశాడంటూ.. వరంగల్ రూరల్‌ జిల్లాలో ఓ యువతి ధర్నాకు దిగింది. శశిధర్, స్వాతి.. ఇద్దరు ఇంటర్‌ చదువుకునే సమయంలో ప్రేమలో పడ్డారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడికి శారీరకంగా దగ్గరైంది. 7 నెలల గర్భవతి అయింది. పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరిస్తూ వచ్చాడు.

చివరకు అన్యాయం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. రెండు కుటుంబాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు సైతం నెలకొన్నాయి. ప్రేమ అనగానే.. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మేయకండి. చూశారుగా ఎలా మోసం చేస్తున్నారో.. ఇకపై కాస్త జాగ్రత్తగా.. అప్రమత్తంగా ఉండండి.