మాన్సాస్ మంటలు : సంచయిత ఆధార్ కార్డు పరిశీలించండి – అశోక్ గజపతి రాజు

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 02:22 AM IST
మాన్సాస్ మంటలు : సంచయిత ఆధార్ కార్డు పరిశీలించండి – అశోక్ గజపతి రాజు

విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది.  సింహాచలం దేవస్థానం ఆస్తుల పాటు.. విలువైన ట్రస్టు భూములను కొట్టేయడానికి ప్రభుత్వం స్కెచ్‌ వేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. సంచయితను ట్రస్ట్ బోర్డ్ చైర్‌ పర్సన్‌గా తప్పించాలంటూ విజయనగరంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అటు టీడీపీ నేతలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంచయిత తెలిపారు.

మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదన్నారు కేంద్ర మాజీ మత్రి అశోక్‌గజపతిరాజు. సింహాచలం దేవస్థానం పరిధిలో 105 ఆలయాలు, విలువైన భూములు ఉన్నాయని, దేవస్థానం భూములపై కొందరు కన్నేశారని ఆరోపించారు. దాతలు ఇచ్చిన భూములు ఆలయానికే చెందాలని స్పష్టం చేశారు. ట్రస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని, ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయన్నారు. పిల్లలకు భవిష్యత్‌ను ఇవ్వడానికే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సంచయిత ఆధార్‌ కార్డు పరిశీలిస్తే ఆమె ఎక్కడ నివసిస్తున్నారో అందరికీ తెలుస్తుందన్నారు.

తన మీద, తన కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం బాధగా ఉందన్నారు సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్‌పర్సన్ సంచయిత గజపతి. మహిళ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా ఎన్నికైతే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఏ ఆశయం కోసం తన తాతగారు మాన్సాన్‌ ట్రస్ట్  ఏర్పాటు చేశారో ఆ ఆశయ సాధనకు పని చేస్తానన్నారు. సింహాచలం దేవాలయ భూములు, ట్రస్ట్ భూములు ఎవరికి చెందినవి కావని స్పష్టం చేశారు. తనను ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకోవడంపై.. టీడీపీ నేతలు కోర్టుకు వెళితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించారు, అప్పుడు మాట్లాడని వాళ్లు, ఇప్పుడెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సంచయిత ప్రశ్నించారు. 

మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.  మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆస్తులపై వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని చంద్రబాబు ఆరోపించారు. సింహాచలం ఆలయ భూములు లాక్కోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వంగా వస్తున్న ఆస్తులపై ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని మండిపడ్డారు. అటు బీజేపీ కూడా వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.  భూములను కొట్టేయడానికే ట్రస్ట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌, సీనియర్‌ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. సంచయిత వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఇతర మతానికి చెందిన సంచయితకు ఆలయ బాధ్యతలు అప్పగించారంటూ విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. 

Read More : మాన్సాస్ ట్రస్టు వివాదం : ఏపీలో సంచయిత రాజకీయం