రూ.30వేలు.. వాలంటీర్లకు సీఎం జగన్ కానుక.. సత్కారంతో పాటు నగదు పురస్కారం

రూ.30వేలు.. వాలంటీర్లకు సీఎం జగన్ కానుక.. సత్కారంతో పాటు నగదు పురస్కారం

cm jagan gift for volunteers: ఏపీలో ప్రభుత్వ పాలనలో కీలకంగా మారిన వాలంటీర్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి శుభవార్త వినిపించారు. బిరుదులతో సత్కరిండంతో పాటు నగదు పురస్కారం అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఉగాది నుంచి బిరుదులతో సత్కారం, నగదు పురస్కారం:
ఉగాది నుంచి అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లను సత్కరించాలని.. సేవా రత్న, సేవా మిత్ర, సేవా వజ్ర వంటి బిరుదులు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. తమ బాధ్యతలను ఉద్యోగంగా భావించకుండా, సేవా దృక్పథంతో పని చేస్తున్న వాలంటీర్లకు రివార్డుతో కూడిన అవార్డులు ఇవ్వాలన్నారు. ఇలా చేయడం ద్వారా వారి సేవల్ని గుర్తించి, ప్రోత్సహించినట్లు అవుతందన్నారు.

మూడు కేటగిరీలుగా విభజన:
వాలంటీర్ల సేవలను గుర్తించేలా ఉగాది రోజున ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని సీఎం జగన్ సూచించారు. మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వాలంటీర్లు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి.. ఉగాది నుంచి వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో తాను ఈ కార్యక్రమాలకు హాజరవుతానని సీఎం తెలిపారు.

సచ్ఛీలత, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కోవిడ్‌-19 సర్వే వంటి అంశాలు ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటారు. వాలంటీర్లు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి.. ఉగాది నుంచి వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించనున్నారు.

కేటగిరి 1:
ఏడాది పాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలిస్తారు. ఇందులో ఎంపికైన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారం, బ్యాడ్జ్, రూ.10 వేల నగదు బహుమతి.

కేటగిరి 2:
ప్రతి మండలం, పట్టణంలో ఐదుగురు చొప్పున వాలంటీర్ల ఎంపిక. వీరికి సేవా రత్న పురస్కారం, స్పెషల్‌ బ్యాడ్జ్, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి.

కేటగిరి 3:
ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వాలంటీర్ల ఎంపిక. వీరికి సేవా వజ్రం పేరిట పురస్కారం, స్పెషల్‌ బ్యాడ్జ్‌తో పాటు మెడల్, రూ.30 వేల చొప్పున నగదు పురస్కారం.

పక్షపాతం చూపకుండా, అవినీతి చేయకుండా సేవా దృక్పథాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.