CM Jagan About Administration : 26జిల్లాలు ఎందుకో అందరికీ తెలియాలి, అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందాలి-సీఎం జగన్
26 జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేశామన్నది అందరికీ తెలియాలని సీఎం జగన్ అన్నారు. పరిపాలన అనేది సులభతరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
CM Jagan About Administration : ఏపీలో 26 జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేశామన్నది అందరికీ తెలియాలని సీఎం జగన్ అన్నారు. పరిపాలన అనేది సులభతరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలో ఉండాలని అభిప్రాయపడ్డారు. అధికారులు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని, ప్రజల పట్ల మరింత మానవీయ దృక్పథంతో మెలగాలని సూచించారు సీఎం జగన్. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు జగన్. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇళ్ల నిర్మాణం గురించి కూడా జగన్ మాట్లాడారు. తొలి దశలో రాష్ట్రంలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు సీఎం జగన్ తెలిపారు. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగ్ లో పడిందని వెల్లడించారు. ఈ కేసుల పరిష్కారం కోసం అధికారులు ప్రయత్నించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందాలని, అందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు జగన్. కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు.
మరోవైపు ఈ నెల 28న విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా వేలాది మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలు అందించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. విశాఖ నగర శివారులో ఒకేచోట 72 లే ఔట్లను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 300 ఎకరాల మేర విస్తీర్ణంలో 9 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ ఇళ్ల స్థలాల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు సీఎం జగన్.
జగనన్న ఇళ్ల పట్టాలు, నిర్మాణం, సంపూర్ణ గృహహక్కు పథకంపైనా జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందాలని స్పష్టం చేశారు. ‘తొలి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని అనుకున్నాం. కోర్టు కేసుల కారణంగా 42వేల 639 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయ స్థాలు చూడాలి. ప్రతి 1000 ఇళ్లకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్ ను నియమించాలి’ అని జగన్ చెప్పారు.