AP CM YS Jagan: గుడ్న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 809 చికిత్సలు.. ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
గత టీడీపీ హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట్లు అధికంగా వైసీపీ హయాంలో ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
AP CM YS Jagan: ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరో 809 చికిత్సలను చేరుస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా పెంచిన చికిత్సలతో ఆరోగ్య శ్రీ పథకం కింద 3,255 చికిత్సలను అందిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో పోలిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అదనంగా 2,196 వైద్య చికిత్సలను చేర్చినట్లు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో సీఎం జగన్ నూతన చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం కింద అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ పథకం అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం ఆరోగ్య శ్రీ కింద 1059 చికిత్సలు అందిస్తుండగా వాటిని తమ ప్రభుత్వంలో 3,255కు పెంచినట్లు వివరించారు. మే 2019 నాటికి ఆరోగ్య శ్రీ వైద్య చికిత్సల సంఖ్య 1059 ఉండగా జనవరి 2020లో 2059 పెంచామన్నారు. వైద్యం ఖర్చు 1000 రూపాయలు పైగా ఖర్చయ్యే ప్రతి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు.
జులై 2020లో 2200 వైద్య సేవలు, నవంబర్ 2020లో 2436, జూన్ 2021లో 2446 చికిత్సలు అదేవిధంగా 2022లో 3255 వైద్య చికిత్సలకు ఆరోగ్యశ్రీలో అందుబాటులోకి తేవటం జరిగిందని తెలిపారు. గత టీడీపీ హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట్లు అధికంగా వైసీపీ హయాంలో ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.