విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీలో రెండు మాటలు, సోము వీర్రాజు – సుజనా ఏమన్నారు ?

విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీలో రెండు మాటలు, సోము వీర్రాజు – సుజనా ఏమన్నారు ?

Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీలో రెండు మాటలు వినిపిస్తున్నాయ్‌. స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఇటు దేశానికి ఆర్థికంగా వినియోగపడేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి మరో విధంగా మాట్లాడారు.

సోము వీర్రాజు : –

‘ప్రజా ఉద్యమంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను పూర్తిగా ఏకీభవిస్తున్న సందర్భంలో తమ పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ మాధవ్..తాను..ఫైనాన్స్ మంత్రి, స్టీల్ మంత్రులను కలవడం జరిగింది. 14వ తేదీన నడ్డాను కలిసి స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావిస్తాం. స్టీల్ ప్లాంట్ కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతాం’. అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అంటే..

సుజనా చౌదరి : –
‘ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని జనరల్ వ్యూ. దాని ప్రకారం..భారతదేశానికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా..ఇలాంటి డిసిషన్ తీసుకోవడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీయో..వైసీపీ పార్టీయో విబేధిస్తే..ఆగేది కాదు. ఇది మాస్టర్ పాలసీ ద్వారా వచ్చింది. ఇప్పుడది కాదు..గత 20 సంవత్సరాల కిందటి నుంచి మొదలైంది. సరుకు తీసుకుని వేరే దేశానికి, రాష్ట్రానికి తీసుకెళ్లేది కాదు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది. ఎంప్లాయిమెంట్ జనరేషన్ అక్కడే ఉంటుంది. ఎంతో మంది ప్రాణాలు అర్పించి..విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఆ రోజుల్లో తీసుకవచ్చారు. ప్రైవేటు వారి దగ్గరి నుంచి అంత పెట్టుబడులు రాలేకపోవడంతో..ప్రభుత్వం వచ్చింది. ఆర్థిక విధానాలు, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి డెసిషన్ తప్పవని మా ఉద్దేశ్యం’ అని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వెల్లడించారు.

మరోవైపు…విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించాలన్న కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్ర నిర్ణయాన్ని.. ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. 2021, ఫిబ్రవరి 05వ తేదీ శుక్రవారం భారీ నిరసనలకు కార్మికులు ప్లాన్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ ప్రాణాలు అర్పించి కర్మాగారాన్ని సాధించుకున్నామని.. ఆవిధంగానే ప్రాణాలు ఒడ్డయినా ప్లాంట్‌ను రక్షించుకుంటామని కార్మికులు హెచ్చరిస్తున్నారు.