దివ్య తేజస్విని మర్డర్ కేసు కొత్త ట్విస్టు, నాగేంద్రతో వివాహం జరగలేదు, ఫొటో మార్ఫింగ్ ?

  • Published By: madhu ,Published On : October 19, 2020 / 09:29 AM IST
దివ్య తేజస్విని మర్డర్ కేసు కొత్త ట్విస్టు, నాగేంద్రతో వివాహం జరగలేదు, ఫొటో మార్ఫింగ్ ?

divya tejaswini case: ఏపీలో సంచలనం రేపిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని మర్డర్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. నాగేంద్ర – దివ్య వివాహం చేసుకున్నట్లు ఉన్న ఫొటో మార్ఫింగ్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దివ్య అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి దిశ స్పెషల్ విభాగం ఆఫీసర్ దీపికా పాటిల్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసును మాచవరం పోలీసులు దర్యాప్తు చేపడుతున్న సంగతి తెలిసిందే.



దివ్య స్నేహితులను విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆమె తీసిన సెల్పీ వీడియోలో చెప్పిన వ్యక్తి ఎవరు ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. దివ్య ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చివరి సారిగా మాట్లాడిన ఓ వీడియో..కీలకంగా మారింది. తాను ఓ సైకోతో పోరాడుతున్నానని…అతను తన జీవితం నాశనం చేయాలని చూశాడని ఆ వీడియోలో చెప్పుకుంది.



తాను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని…పోరాడాలని అనుకుంటున్నానని కంటతడి పెట్టింది. అలాగే తనకు బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయంటూ..ఓ మహిళ వల్ల తాను మోసపోయానంటూ బాధపడింది. నాగేంద్ర వేసిన మాస్టర్ ప్లాన్ కు దివ్య తేజస్వి బలైన సంగతి తెలిసిందే. దూరం పెట్టడంతో నాగేంద్ర కోపం పెంచుకున్నాడని, ఆమె స్నేహితుల సహాయంతో నాగేంద్ర వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు.



ప్రస్తుతం దివ్య ఫోన్ ను సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. స్నేహితులకు ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లను దివ్య యాక్సిస్ ఇచ్చినట్లు తేలింది.



అయితే..గుంటూరు జీజీహెచ్‌లో కోలుకుంటున్న నాగేంద్ర… దివ్య హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు. సూసైడ్ చేసుకోవాలని ఇద్దరం నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాడు. కానీ ఆమె శరీరంలో 13 కత్తిపోట్లు ఎలా ఉన్నాయో అంతుచిక్కడం లేదు. దిశ పోలీసులు జరిపే దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయో చూడాలి.