Narendra Modi : ప్రధాని పర్యటనలో నల్ల బెలూన్లు-ఐదుగురు అరెస్ట్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈరోజు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హజరు పరచనున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, సావిత్రి, కిషోర్, రవికాంత్, రాజశేఖర్ లు ఉన్నారు.
ప్రధాని మోదీ నిన్న ఏపీ లో పర్యటించిన సందర్బంలో నల్ల బెలూన్లు అలజడి సృష్టించాయి. గన్నవరం ఎయిర్పోర్టులో ప్రధాని హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు నల్లటి బెలూన్లు ఎగురవేశారు. ఎవరూ ఊహించని ఈ ఘటనతో కలకలం రేగింది. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణను వచ్చే సమయంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రధాని టూర్లో బయటపడ్డ భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. అయితే.. పోలీసులు మాత్రం.. సెక్యూరిటీ లోపం లేనే లేదంటున్నారు.
మరో వైపు మోదీ పర్యటనను నిరసిస్తూ గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లిలో కొంతమంది కాంగ్రెస్ నేతలు నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో ఎయిర్పోర్ట్ సమీపంలో ఓ బిల్డింగ్పై నుంచి, పొలాల్లో నుంచి ఈ బెలూన్లను వదిలారు. అటు.. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సుంకర పద్మశ్రీని అడ్డుకుని బెలూన్లను స్వాధీనం చేసుకున్నారు.
మోదీ పర్యటనలో బయటపడ్డ భద్రతా లోపాలపై ఉన్నతాధికారుల సీరియస్గా అయ్యారు. ప్రధాని హెలికాప్టర్కు సమీపంలో బెలూన్లు ఎగరడంతో.. భద్రతాపరంగా అత్యంత ప్రమాదకరమన్న ఎస్పీజీ అధికారులు..ఈ ఘటనపై సీరియస్గా తీసుకున్నారు. అయితే గన్నవరం ఎయిర్పోర్టు బెలూన్ల వ్యవహారంపై పోలీసుల వింత వాదన వినిపించారు. మూడు బెలూన్లు ఎగురవేస్తే భద్రతా లోపం అంటారా..? అని ప్రశ్నించారు డీఎస్పీ విజయపాల్. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామన్నారు.
ప్రధాని హెలికాప్టర్లకు సమీపంలో నల్ల బెలూన్ల ఎగురవేత భారీ కుట్రేనన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కొన్ని దుష్ట శక్తులు ఈ పనిచేశాయని ఆరోపించారు. బెలూన్ల ఎగరవేతలో.. సూత్రధారులు, పాత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదుచేస్తానన్నారు సోము వీర్రాజు.
మొత్తంమ్మీద మోదీ ఏపీ పర్యటనలో బెలూన్ల వ్యవహరాన్ని సీరియస్గా పరిగణిస్తున్నారు ఎస్పీజీ అధికారులు. ఇటు బెలూన్ల ఎగరవేతతో ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారుల నిఘా వైఫల్యం స్పష్టంగా ఉందని భావిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు.
Also Read : Telangana : మా ప్రశ్నకు బదులేది-కమల నాధులపై గులాబీ దళం ప్రశ్నల పరంపర