శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్ డౌన్
ఆంధ్రప్రదేశ్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్ డౌన్ విధించారు. జిల్లాలో లాక్ డౌన్ పొడిగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ పొడిగించారు. శ్రీకాకుళంలో ఈనెల 15 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తూర్పుగోదావరిలోని రావులపాలెంలో ఆగష్టు 9 వరకు కఠిన లాక్ డౌన్ విధించారు. నెల్లూరులో కూడా ఆగష్టు 8 వరకు లాక్ డౌన్ను పొడిగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు. అటు ప్రకాశం జిల్లా కనిగిరిలో కూడా ఈ నెల 10వ తేదీ వరకు లాక్ డౌన్ను పొడిగించారు.
మంగళవారం, శుక్రవారం రోజుల్లో మాత్రమే నిత్యావసరాలు, కూరగాయలు తెచ్చుకోవడానికి అనుమతించారు. అలాగే ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు మచిలీపట్నంలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. నిన్న 10,171 కేసులు నమోదు కాగా కరోనాతో 89 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య 2,06,960కు చేరింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1842 మంది మృతి చెందారు. ఏపీలో 84,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 1,20,464 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.