Lokesh On Liquor Deaths : శవ రాజకీయాలకు జగన్ బ్రాoడ్ అంబాసిడర్-నారా లోకేష్
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. అధికార పార్టీని టార్గెట్ చేసింది. కల్తీసారా మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది.(Lokesh Liquor Deaths)
Lokesh On Liquor Deaths : కల్తీసారా మరణాల అంశం ఏపీని కుదిపేస్తోంది. ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. అధికార పార్టీని టార్గెట్ చేసింది. కల్తీసారా మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది. ఇవన్నీ సర్కారీ హత్యలే అని ఆరోపిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్.. ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు.
శవ రాజకీయాలకు జగన్ రెడ్డి బ్రాoడ్ అంబాసిడర్ అని అన్నారు. తండ్రి మృతదేహం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు. మనకు తెలిసి చనిపోయింది 25 మందే, తెలియకుండా రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య తేలాలి అని లోకేష్ అన్నారు. కల్తీసారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందన్నారు. మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా? అని ధ్వజమెత్తారు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై పోస్టుమార్టం రిపోర్టు రాకముందే… అవన్నీ సహజ మరణాలని మంత్రులే తేల్చడమేంటని మండిపడ్డారు లోకేశ్. జగ్గారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు చేపట్టాలన్నారాయన.
Chandrababu: దొంగ సారా, కల్తీ సారా వ్యాపారం చేస్తున్నది వైసీపీ నాయకులే: చంద్రబాబు
రాష్ట్రంలో మద్యం దుకాణాల కాలపరిమితిని పెంచి మరీ మద్యం విక్రయాలు జరిపిస్తున్నారు. అధిక ధరలకు సర్కారీ మద్యం కొనలేక కల్తీసారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారు అని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వాపోయారు. కల్తీసారా మరణాలపై న్యాయ లేదా సీబీఐ విచారణ జరగాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు డిమాండ్ చేశారు. కల్తీసారా మరణాలకు నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ డిమాండ్ చేశారు. కల్తీసారాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న 18 మరణాలపై ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. ఈ మరణాలన్నీ నాటు సారా కారణంగానే చోటుచేసుకున్నాయని విపక్ష టీడీపీ ఆరోపించగా.. అందులో వాస్తవం లేదంటూ అధికార వైసీపీ బదులిచ్చింది. ఇరు వర్గాల మధ్య వాద ప్రతివాదనలు చోటుచేసుకున్నాయి. చివరకు అసెంబ్లీ నుంచి టీడీపీకి చెందిన ఐదుగురు సీనియర్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కూడా రచ్చ కొనసాగింది.
అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు. నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. స్వయంగా లోకేశ్ కూడా ఓ ప్లకార్డు పట్టుకుని నిరసనను ముందుండి నడిపించారు. జగన్ మోసం ఖరీదు ఈ 25 ప్రాణాలు అంటూ రాసి ఉన్న ప్లకార్డును లోకేశ్ పట్టుకున్నారు.
CM Jagan : మద్యపానం తగ్గించాలన్నదే మా లక్ష్యం : సీఎం జగన్
జంగారెడ్డిగూడెంలో సారా మరణాలన్నీ జగన్ హత్యలేనంటూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి అసెంబ్లీ బయట నిరసన తెలిపామని లోకేష్ తెలిపారు. మద్యనిషేధం అన్న జగన్.. మాట తప్పి సొంత బ్రాండ్లు దించి ప్రజల్ని దండుకోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. సారా మరణాలపై న్యాయవిచారణ జరగాలని.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లోకేశ్.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలు అన్ని @ysjagan హత్యలేనంటూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి అసెంబ్లీ బయట నిరసన తెలిపాం. మధ్యనిషేదం అన్న జగన్ మాట తప్పి సొంత బ్రాండ్లు దించి ప్రజల్ని దండుకోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి(1/2)#YSRCPNatuSaraMafia pic.twitter.com/qpsiluL4Lp
— Lokesh Nara (@naralokesh) March 14, 2022
జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలు.. కల్తీసారా మరణాలే అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలకు సీఎం జగన్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. సహజ మరణాలను కూడా టీడీపీ వక్రీకరిస్తోందని జగన్ అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో నాటుసారా తయారీ విచ్చలవిడిగా జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం అక్కడక్కడ జరుగుతోందని, దాని కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జగన్ సభలో తెలిపారు.
లాభాపేక్షతో గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపిందని జగన్ ఆరోపించారు. గతంలో గుడి, బడి ప్రాంతాల్లోనూ మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. సహజ మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటాయన్న జగన్.. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎదురుదాడికి దిగారు.