ఏపీలో అమరావతి కూడా అంతర్భాగమే..అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం : మంత్రి బొత్స
ఏపీలో అమరావతి కూడా అంతర్భాగమేనని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసే కార్యాచరణపై చర్చించామని తెలిపారు. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స, సీఎస్ నీలం సాహ్ని పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలన్నీ పూర్తి చేస్తామని చెప్పారు.
ఆ భవనాలను ఎందుకు ఉపయోగించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని జగన్ చెప్పారని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతులకు రిటన్ ప్లాట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రతిపక్ష బాధ్యత విస్మరించారని విమర్శించారు. చంద్రబాబుకు స్వప్రజయోజనాలే ముఖ్యమన్నారు.
అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అమరాతిలో ప్రస్తుతం ఏ ఏ దశల్లో నిర్మాణాలున్నాయో అధికారులను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. వాటిని పూర్తి చేసే కార్యాచరణపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.
నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆర్థిక శాఖ అధికారులతో కలిసి కూర్చొని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. హ్యాపినెస్ట్ బిల్డింగులను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.