AP Rain Alert : ఏపీకి వాన గండం.. రెండు రోజులు భారీ వర్షాలు, ఆ జిల్లాలకు అలర్ట్
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రోజులు(సోమ, మంగళవారం) భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రోజులు(సోమ, మంగళవారం) భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వాన ముప్పు పొంచి ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. సోమ, మంగళవారాల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండటంతో.. మంగళవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల సూచనతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
వానా కాలం ముగిసినా వరుణుడు మాత్రం వదలడం లేదు. తమిళనాడు ఇప్పటికే వర్షాలతో అల్లాడిపోతోంది. 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఎక్కడి చూసినా బురద నీరే కనిపిస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలను చలి వణికిస్తోంది. విశాఖ ఏజెన్సీతో పాటు తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.