గెట్ రెడీ.. స్కూళ్లు సిద్ధం అవుతున్నాయ్..

  • Published By: vamsi ,Published On : September 15, 2020 / 08:08 AM IST
గెట్ రెడీ.. స్కూళ్లు సిద్ధం అవుతున్నాయ్..

కరోనా కారణంగా దాదాపు ప్రపంచం మొత్తం ఆగిపోయింది. స్కూళ్లు లేవ్.. థియేటర్లు లేవ్.. సినిమాల్లేవ్.. షికార్లు లేవ్.. పిల్లలు అయితే బయట తిరిగే పరిస్థితి లేదు.. సుదీర్ఘకాలంగా ఇంటికే పరిమితమయ్యారు చదువుకునే విద్యార్థులు. అయితే మళ్లీ స్కూళ్లలో అడుగు పెట్టేందుకు సర్వం సిద్ధం అవుతోంది. స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియకు మార్గదర్శకాలు పూర్తి కాబోతున్నాయి.




పరీక్షల్లేకుండా పై తరగతులకు ప్రమోషన్, సర్టిఫికెట్లు లేకపోయినా స్కూళ్లలో చేర్చుకోవడం వంటి ప్రక్రియను చేపట్టారు. ఇతర స్కూళ్లలో చేరాలని అకున్నవారికి టీసీలు జారీ చేయడానికి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు పూర్తి చేస్తున్నారు అధికారులు. ఎవ్వరినీ బలవంతంగా స్కూళ్లకు పంపకుండా, అదంతా తల్లిదండ్రుల అనుమతితోనే జరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు.
https://10tv.in/corona-effect-borno-classroom-transformed-into-a-poultry-farm-as-schools-remain-closed/
దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే స్కూళ్లు తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోవడానికి, పై తరగతులకు ప్రమోట్‌ చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేస్తుంది.

కొత్త నిబంధనలు ప్రకారం.. కోవిడ్‌ ప్రోటోకాల్ ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది పాఠశాల విద్యాశాఖ. ప్రవేశాల కోసం విద్యార్థులను స్కూళ్లకు రప్పించరు. ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ హెడ్ మాస్టర్లు, టీచర్లు దీనిని పూర్తి చేస్తారు. 5, 7వ తరగతుల విద్యార్థులు తదుపరి చదువుల కోసం ఇతర పాఠశాలలకు వెళ్లాల్సి వస్తే తల్లిదండ్రుల అభిప్రాయాలను స్వీకరించి ప్రవేశాలను చేపట్టాలి.



ఈ మేరకు ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మార్గనిర్దేశం చేస్తారు. 5, 7వ తరగతులు చదివిన విద్యార్థులు తదుపరి ఏ స్కూల్లో చదవాలని అనుకుంటున్నారో తల్లిదండ్రులతో హెడ్మాస్టర్లు నిర్ధారించుకోవాలి. ఆ సమాచారాన్ని పిల్లలు చేరదలచుకున్న పాఠశాలల హెడ్మాస్టర్లకు లిఖితపూర్వకంగా తెలియచేయాలి. తల్లిదండ్రులతో మాట్లాడి ఆయా స్కూళ్లలో ప్రవేశాలు సజావుగా జరిగేలా చూడాలి. ప్రాథమిక పాఠశాలల విషయంలో ఎంఈవోలు, హైస్కూళ్ల విషయంలో దీనిని పర్యవేక్షించాలి.



తల్లిదండ్రుల సమ్మతి లేకుండా ఏ విద్యార్థినీ ఇతర స్కూళ్లలోకి పంపకూడదు. విద్యార్థి ఏ స్కూల్లో చేరాలని అనుకున్నా.. తల్లిదండ్రుల ఆప్షన్‌ను లిఖితపూర్వకంగా తీసుకోవాలి. తల్లిదండ్రుల సమ్మతి తీసుకున్నాక విద్యార్థి స్కూల్‌ రికార్డు, టీసీలను విద్యార్థి చేరదలుచుకున్న పాఠశాల హెడ్మాస్టర్‌/ప్రిన్సిపాల్‌కు అందించాలి. ఇందుకు సంబంధించిన రసీదును కూడా తీసుకోవాలి.

స్వస్థలాలకు చేరుకున్న ఉపాధి కూలీల పిల్లలకు ఎలాంటి గుర్తింపు పత్రాలు అడగకుండా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ల(టీసీ) కోసం బలవంతం చేయకూడదు. గతంలో చదివిన తరగతి తాలూకు సర్టిఫికేట్లు అడగకుండా తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం సరైనదిగా భావించి సదరు తరగతిలో పిల్లలకు ప్రవేశం కల్పించాలి. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినా, తుది నిర్ణయం మాత్రం కేంద్రం ప్రకటించే లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా తీసుకోవలసి ఉంటుంది.




రెసిడెన్సియల్‌ స్కూళ్లు, మోడల్‌ పాఠశాలలు, కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల ప్రక్రియ ఆన్‌లైన్లో జరుగుతున్నందున వారికి సంబంధించిన సర్టిఫికేట్లు, రికార్డులను సంబంధిత ప్రిన్సిపాళ్లు రసీదులు తీసుకొని అప్పగించాలి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను వారి సామర్థ్యాలను అనుసరించి తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి. బడి బయటి పిల్లలను హెడ్మాస్టర్లు, టీచర్లు గుర్తించి వారికి కూడా ప్రవేశాలు కల్పించాలి.

కోవిడ్‌ కారణంగా ఇప్పటికే ప్రాథమిక పాఠశాల్లో 1 నుంచి 4వ తరగతి వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1 నుంచి 6వ తరగతి వరకు, హైస్కూళ్లలో 6 నుంచి 9వ తరగతి వరకు చదివిన పిల్లలను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ వారి పేర్లను రిజిస్టర్లలో నమోదు చేయించుకోవాలి.