కరోనా కట్టడిపై ఇక రాష్ట్రాలదే నిర్ణయం!

  • Published By: srihari ,Published On : May 30, 2020 / 01:31 AM IST
కరోనా కట్టడిపై ఇక రాష్ట్రాలదే నిర్ణయం!

కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యలపై అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. జూన్‌ 1 నుంచి కరోనా కేసులు, వ్యాప్తి, కంటెయిన్‌మెంట్‌ జోన్‌లు, ఇతర ఆంక్షలు, సడలింపులపై ఇక రాష్ట్రాలే నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దాదాపు 80శాతం పాజిటివ్‌ కేసులు ఉన్న 30 మున్సిపల్‌ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని కేంద్రం సూచనలు చేసే అవకాశం ఉంది. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఒడిశాల్లో 30 మున్సిపల్‌ ప్రాంతాలు ఉన్నాయి. కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాల గురించి కేంద్రం ఎక్కువగా ఆందోళన చెందుతోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు, సామూహికంగా ప్రజలు పాల్గొనే కార్యక్రమాలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ తదితరాలపై నిషేధం కొనసాగే అవకాశముందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్‌లను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశించవచ్చు అన్నారు. 

విద్యా సంస్థలు, మెట్రో ట్రైన్‌ సర్వీసులు, ప్రార్థనా స్థలాల పునఃప్రారంభంపై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ అమలుపై రాష్ట్రాలతో ప్రతీ 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దేవాలయాలు, మసీదులు, చర్చీలను పునఃప్రారంభించేందుకు అనుమతించాలని ప్రధాని మోడీకి అభ్యర్థనలు వస్తున్నాయి. లాక్ డౌన్ 4.0 దశ మే 31వ తేదీతో ముగియనుంది. లాక్‌డౌన్‌ ప్రభావం.. మే 31 తరువాత.. కేంద్రం, రాష్ట్రాల పాత్రపై కేంద్రం చర్చిస్తోంది.

వైరస్‌ అధికంగా ఉన్న 30 నగరాల్లో 13 నగరాల మున్సిపల్‌ కమిషనర్లు, కలెక్టర్లతో కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా ఆన్‌లైన్‌ భేటీ నిర్వహించారు. 13 నగరాల్లో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, థానె, పుణె, కోల్‌కతా, జైపూర్, హౌరా, తిరువళ్లూరు ఉన్నాయి. కరోనా, లాక్‌డౌన్‌లకు సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. జూన్‌ 1 నుంచి ఏయే రంగాల్లో ఆంక్షలను సడలించాలనే విషయంలో సూచనలు తీసుకున్నారు. చాలామంది సీఎంలు లాక్‌డౌన్‌ను పరిమిత స్థాయిలో కొనసాగించాలనే భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అమిత్‌ షాతో మాట్లాడిన అనంతరం.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశమున్నట్లు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. 

లాక్‌డౌన్‌ మరో రెండు రోజుల్లో ముగియనుంది. రాష్ట్రంలో పలు ఆంక్షలను సడలిస్తూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనా స్థలాలను జూన్‌ 1నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌ 8 నుంచి ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు 100శాతం హాజరుతో పని చేస్తాయన్నారు. ప్రార్థనా మందిరాల్లో గుంపులుగా గుమికూడవద్దని సూచించారు. 10 మందికి మించి ఒకేసారి లోపలికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. 

Read: ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి చేసి.. కరోనా శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు