Congress Protest : ‘ట్విట్టర్ పక్షి’ని వండుకుని తిన్న కాంగ్రెస్ నేతలు
రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ నిలిపివేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది.
Congress leaders protesting : రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ నిలిపివేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది. ట్విట్టర్ బర్డ్ ను ఫ్రై చేసి ఆ కార్యాలయానికి పోస్టు చేశారు. ట్విటర్ మీద ఉన్న కోపాన్ని కాంగ్రెస్ నాయకులు ఓ పక్షిపై చూపించారు. ఆ పక్షిని చంపి ఉప్పుకారం మసాలాలు దట్టించి సలసల కాగే నూనెలో వేయించారు. అనంతరం ఆ మాంసాన్ని ట్విటర్ ప్రధాన కార్యాలయానికి పోస్టు చేశారు.
రాహుల్ ఖాతాను ట్విటర్ నిలిపివేయడానికి నిరసనగా చేసిన ఈ కార్యక్రమం వైరల్గా మారింది. ఈ ఘటనను పలువురు ఖండించగా మరికొందరు హర్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మాజీ ఎంపీ కుమారుడు, అతడి అనుచరులు ఆ పక్షిని కాల్చి వండుకు తిన్నారు.
ట్విటర్ లోగోలో ఉండే పక్షి పిచ్చుక. రాహుల్ గాంధీ ఖాతాను ట్విటర్ వారంపాటు నిషేధించిన అనంతరం పునరుద్ధరించింది. వరుసగా ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఏపీకి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్..ట్విటర్పై కోపంతో పిచ్చుకను కాల్చి మంచిగా వండారు. ఫ్రై చేస్తూనే తాము ఎందుకు ఈ విధంగా చేస్తున్నామో తెలిపారు.
రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా నిలుపుదల చేసి ట్విట్టర్ నిర్వాహకులు తప్పు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ట్వీట్లను ప్రమోట్ చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ చేసిన కుట్రతోనే ట్విట్టర్ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లను బ్లాక్ చేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నాయకులు బీజేపీ డౌన్డౌన్ అని నినాదాలు చేశారు.
ఇకనైనా ట్విట్టర్ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వండిన పిచ్చుక మాంసాన్ని ఒక డబ్బాలో పెట్టి గురుగ్రామ్లోని ట్విటర్ కార్యాలయానికి పంపుతున్నట్లు చెప్పారు. తపాలా కార్యాలయానికి వెళ్తున్నవరకు వీడియో ఉంది. అనంతరం వారు ఆ బాక్స్ పోస్టు చేశారు.