TTD Tickets Online: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్లైన్ టికెట్లు విడుదల!
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13,000 చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ.
TTD Tickets Online: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13,000 చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈరోజు అంటే, ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుంచి టీటీడీ ఆన్లైన్లో దర్శనం టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి.
అదేవిధంగా, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు అధికారులు.
మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేశారు. అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్లైన్లో తిరుపతిలోని కౌంటర్లలో అందజేస్తారు. టీటీడీ వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఆన్లైన్లో టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి.
గత నెలలోనూ పరిమిత సంఖ్యలోనే టికెట్లు రిలీజ్ చేయగా.. కాసేపటికే అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈసారి టికెట్ల సంఖ్య పెంచినా కూడా కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులు వెంటనే కొనేస్తున్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే టికెట్లు పొందవచ్చు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీటీడీ స్పష్టం చేసింది.