YV Subba Reddy On BRS : ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీదే అధికారం, కేసీఆర్ జాతీయ పార్టీపై వైవీ సుబ్బారెడ్డి స్పందన
కొత్త పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఎన్ని పార్టీలు వచ్చినా ఏపీలో మాత్రం వైసీపీదే అధికారం అని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. తమ సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ సీఎంని చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
YV Subba Reddy On BRS : సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ(బీఆర్ఎస్) ప్రకటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కొత్త పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు వైవీ సుబ్బారెడ్డి. అయితే ఎన్ని పార్టీలు వచ్చినా ఏపీలో మాత్రం వైసీపీదే అధికారం అని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. తమ సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ సీఎంని చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
”ఎన్నో పార్టీలు వస్తుంటాయి. వాటి గురించి మనమెందుకు మాట్లాడుకోవాలి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఏపీలో ఎవరు పోటీ చేసినా సమస్య లేదు. జగన్ పాలనను ప్రజలు చూస్తున్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది, జగనే సీఎం అవుతారు. ఎన్ని పార్టీలు వచ్చినా మన ఓట్లు మనకున్నాయి. సంక్షేమ పథకాలే మన ఆయుధాలు. అవి చూసే మళ్లీ మనకు ఓట్లు వేస్తారు. మళ్లీ జగన్ సీఎం అవుతారు. మన రాష్ట్రంలో మనం చూసుకున్నాకే తర్వాత దేశానికి ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచన చేద్దాం” అని మీడియా ప్రతినిధులతో అన్నారు వైవీ సుబ్బారెడ్డి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
కాగా, దసరా(అక్టోబర్ 5) పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీని అనౌన్స్ చేశారు. టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. దేశంలో అనేక పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడలా మారిపోయిందని.. తనకు మాత్రం రాజకీయం అనేది ఒక టాస్క్ వంటిదని చెప్పారు గులాబీ బాస్.
టీఆర్ఎస్.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన అంశంపై గులాబీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తమ పార్టీ జాతీయ స్థాయిలో విజయం సాధించి తీరుతుందని చెబుతున్నారు. విజయ దశమి నాడు ప్రారంభమైన బీఆర్ఎస్ దేశంలో విజయ దుందుభి మోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ దేశ భవిష్యత్తునే మార్చబోతోందని, బీఆర్ఎస్ ఏర్పాటు దేశ రాజకీయాల్లో నవ శకానికి నాంది పలికిందని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బుధవారం ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని లిఖించనుందన్నారు. దేశ ప్రజల అభ్యున్నతికి బీఆర్ఎస్ అవిశ్రాంత కృషి చేయనుందని, తెలంగాణ మోడల్ను దేశానికి దిక్సూచిగా మార్చనున్నామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు.