Janasena : వాలంటీర్ చేసిన హత్యకు బాధ్యత ఎవరు తీసుకుంటారు జగన్? ముఖ్యమంత్రిని నిలదీసిన పవన్ కల్యాణ్
వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలు దారుణాలకు పాల్పడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది జనసేన. Janasena - Volunteer
Janasena – Volunteer : విశాఖపట్నంలో వృద్ధురాలు వరలక్ష్మి(72) దారుణ హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బంగారు గొలుసు కోసం వాలంటీర్ వెంకటేశ్ వృద్ధురాలిని అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటన ఆధారంగా వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను టార్గెట్ చేశాయి ప్రతిపక్షాలు. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేసిన జనసేనాని పవన్ కల్యాణ్.. మరోసారి ఘాటుగా స్పందించారు. సీఎం జగన్ పై ప్రశ్నాస్త్రాలు సంధించారు.
విశాఖలో వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేసిన ఘటనపై జనసేన తీవ్రంగా స్పందించింది. మహిళను చంపిన వాలంటీర్ ను వెనకేసుకొస్తావా జగన్? అంటూ ముఖ్యమంత్రిని నిలదీసింది. వాలంటీర్ చేసిన హత్యకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని సీఎం జగన్ ని ప్రశ్నించింది. అసలు వాలంటీర్లను ఏ ప్రతిపాదికన నియమించారు? వారి చట్టబద్ధత ఏంటి? అని అడిగారు. వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలు దారుణాలకు పాల్పడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది జనసేన.
కాగా.. వృద్ధురాలి హత్య కేసులో మలుపు చోటు చేసుకుంది. దీనిపై అధికారులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు వెంకటేశ్ ను వాలంటీర్ విధుల నుంచి జూలై 24వ తేదీన (24-07-2023) తొలగించినట్లు జీవీఎంసీ అధికారులు ప్రకటన చేశారు. పాపయ్యపాలెం సచివాలయం సెక్రటరీ ఉమ మహేశ్వర్ రావు ఫిర్యాదు చెయ్యడంతో అధికారులు యాక్షన్ తీసుకున్నారు. అయితే.. హత్య జరిగిన తర్వాత.. నిందితుడిని విధుల నుంచి తొలగించినట్లు జీవీఎంసీ జోనల్ కమిషనర్ ప్రకటన విడుదల చేయడం చర్చకు దారితీసింది. వృద్ధురాలి హత్య జరిగింది ఆదివారం(జూలై 30) రోజున.
బంగారు గొలుసు కోసం వృద్దురాలిని వాలంటీర్ హత్య చేయడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. విశాఖపట్నం 95వ వార్డు సచివాలయం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్న వెంకటేశ్.. వృద్దురాలిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని పెందుర్తి పరిధిలోని సుజాతనగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది.
మహిళను చంపిన వాలంటీర్ ను వెనకేసుకొస్తావా జగన్ ?? #HelloAP_ByeByeYCP pic.twitter.com/NeRt42hH8P
— JanaSena Party (@JanaSenaParty) July 31, 2023