ZPTC, MPTC Election : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్

ZPTC, MPTC Election : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్

Mptc, Zptc

Andhrapradesh : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు వెల్లడిచేయనున్నారు. ఉదయం 07 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎస్ఈసీగా 2021, ఏప్రిల్ 01వ తేదీ గురువారం బాధ్యతలు తీసుకున్న రోజే…ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. అవసరమైన చోట్ల ఈనెల 09న రీపోలింగ్ నిర్వహించనుంది ఎస్ఈసి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి అధికారులు అభినందనలు తెలియజేశారు. ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ కాలం మార్చి 31తో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే కొన్ని రోజులుగా సస్పెన్ష్ నెలకొంది. తన హయాంలో ఎన్నికలు నిర్వహించలేకపోతున్నట్లు ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎస్ఈసీని అధికార పార్టీ కోరింది. న్యాయపరంగా చిక్కులు ఉండడంతో ఎస్ఈసీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

కరోనా కారణంగా ఎన్నికలు ఏడాది పాటు వాయిదా పడటంతో నోటిఫికేషన్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. మరోవైపు..ఏపీలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రెండంకెల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయితుంటే…ప్రస్తుతం ఈ సంఖ్య మూడెంకెలకు చేరింది. దీంతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే..వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారయంత్రాంగం మొత్తం చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.