Spurious Liquor Deaths : కల్తీ మద్యం కలకలం.. మరో 17 మంది మృతి..!
మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టించింది. కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయారు. చాలామంది అస్వస్థతకు గురయ్యారు.
Spurious Liquor Deaths : బీహార్ లో మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టించింది. కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయారు. చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎల్ జేపీ బ్లాక్ అధ్యక్షుడు నీరజ్ నిశాంత్ కూడా ఉన్నారు. భాగల్ పుర్, బంకా, మధెపురా, మురళీగంజ్ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. కల్తీ మద్యం కారణంగానే తమ వారు మృతి చెందారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. మధెపురాలో ముగ్గురు, బంకా జిల్లాలో 9మంది, భాగల్ పుర్ లో నలుగురు, మురళీగంజ్ లో ఒకరు చనిపోయారు. కొన్ని రోజుల క్రితం కూడా కల్తీ మద్యం తాగి చనిపోయిన ఘటన కలకలం రేపింది. భాగల్ పుర్, గోపాల్ గంజ్ జిల్లాల్లో 16మంది మరణించారు.
బీహార్ లో కల్తీ మద్యం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కల్తీ మద్యం సేవించడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. బీహార్లో సంపూర్ణ నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజూ కల్తీ మద్యం సేవించడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు నియంత్రణ జరగలేదు. కల్తీ మద్యం సేవించడం కారణంగా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.(Spurious Liquor Deaths)
కల్తీ మద్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో కల్తీ మద్యం విచ్చల విడిగా తయారు చేస్తున్నారు. దీని బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బీహార్లో మద్య నిషేధం ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కల్తీ మద్యం ఎలా తయారు చేస్తారు? ఇది విషంగా ఎలా మారుతుంది? దీనిని తాగిన వ్యక్తి ఎందుకు చనిపోతున్నాడు?
Youtuber : రోడ్డు ప్రమాదంలో నటి మృతి-కొబ్బరి బోండాలలో ఆల్కహాలే కారణం ?
కల్తీ మద్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీనినే దేశీ మద్యం కూడా అంటారు. చెరకు లేదా ఖర్జూరం, చక్కెర, సాల్ట్పెట్రే, బార్లీ, మొక్కజొన్న, కుళ్లిన ద్రాక్ష, బంగాళాదుంపలు, బియ్యం, చెడిపోయిన నారింజ మొదలైన వాటిని ముడిసరుకుగా ఉపయోగిస్తారు. వీటన్నిటిని కలిపి ఈస్ట్ ద్వారా పులియబెడతారు. తర్వాత దీనికి ఆక్సిటాక్సిన్, నౌసాదర్, బెస్రాంబెల్ ఆకులు, యూరియా కూడా కలుపుతారు.
ఇవన్నీ నపుంసకత్వానికి దారి తీస్తాయి. అంతేకాదు నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. వీటిని మట్టిలో పాతిపెట్టిన తర్వాత బట్టీ సాయంతో ఆవిరి నుంచి మద్యం తయారు చేస్తారు. దీనిని మరింత మత్తుగా మార్చేందుకు మిథనాల్ కూడా కలుపుతారు. అయితే ఇలా తయారుచేసిన మద్యం మరింత మత్తుగా మార్చేందుకు నిర్వాహకులు రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. ఈ క్రమంలో అది విషంగా మారుతుంది.
యూరియా, ఆక్సిటాక్సిన్, బెస్రాంబెల్ ఆకులు మొదలైన వాటిని కలిపి పులియబెట్టడం వల్ల అది ఆల్కహాల్ (ఇథైల్ ఆల్కహాల్)కు బదులుగా మిథైల్ ఆల్కహాల్గా మారుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ విషపూరితం కావడానికి ఈ మిథైల్ ఆల్కహాలే కారణం. ప్రతి ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి దాని ఆల్కైల్ సమూహంలోని ఆల్డిహైడ్గా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మిక్ యాసిడ్ అనే విషంగా మారుతుంది. ఇది నేరుగా తాగేవారి మెదడుపై ప్రభావం చూపుతుంది.
Karnataka : విడాకులు కోరిన భార్యను విచక్షణా రహితంగా కత్తితో పొడిచిన భర్త
ఇలా తయారు చేసిన ఆల్కహాల్ మానవ శరీరానికి ప్రాణాంతకంగా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రసాయన ప్రతిచర్య వేగవంతం అవుతుంది. దీని వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు పని చేయడం మానేస్తాయి. కొందరిలో ఈ ప్రక్రియ నిదానంగా ఉంటే మరికొందరిలో వేగంగా ఉంటుంది. దీని కారణంగా చాలా సందర్భాల్లో అకాల మరణం సంభవిస్తుంది.