Bridge Stolen : బాబోయ్.. ఏకంగా 80అడుగుల బ్రిడ్జ్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడో తెలుసా
అక్కడి దొంగలు చాలా వెరైటీ. ఇళ్లు, షాపులు వదిలేసి వంతెనల (బ్రిడ్జ్) పై కన్నేశారు. ఐరన్ బ్రిడ్జిలు కనిపిస్తే చాలు.. మాయం చేస్తున్నారు.(Bridge Stolen)
Bridge Stolen : దొంగలు.. ఇళ్లల్లో, షాపుల్లో, బంగారు దుకాణాల్లో దొంగతనాలు చేస్తుంటారు. అక్కడ క్యాష్ లేదా ఆభరణాలు చోరీ చేస్తారు. వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఇది కామన్. కానీ, అక్కడి దొంగలు చాలా వెరైటీ. ఇళ్లు, షాపులు వదిలేసి మరో దానిపై వారి చూపు పడింది. అదేంటో తెలుసా? వంతెనలు (బ్రిడ్జ్). ఏంటి.. షాక్ అయ్యారా? నమ్మకం కలగడం లేదా? కానీ, ఇది నిజం. అక్కడ దొంగలకు ఇదే పని. ఐరన్ బ్రిడ్జిలు కనిపిస్తే చాలు.. ఎత్తుకెళ్లిపోతున్నారు.
అరాచకాలకు, నేరాలకు, ఘోరాలకు కేరాఫ్ గా చెప్పుకునే బీహార్ రాష్ట్రంలో ఈ తరహా దొంగతనాలు ఎక్కువయ్యాయి. అక్కడి దొంగల కన్ను ఐరన్ బ్రిడ్జిలపై పడింది. వంతెన కనిపిస్తే చాలు.. మాయం చేస్తున్నారు.
బీహార్ లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. మరో ఐరన్ బ్రిడ్జిను ఎత్తుకెళ్లిపోయారు. నెల రోజుల క్రితం రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల బ్రిడ్జ్ ను ఎత్తుకెళ్లిన దొంగలు.. తాజాగా మరో వంతెనను మాయం చేశారు. బాంకా జిల్లా చందన్ బ్లాక్ లో 2004లో నిర్మించిన 80 అడుగుల ఐరన్, స్టీల్ బ్రిడ్జ్ ను గ్యాస్ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. 70 శాతం వంతెన మాయమైంది. కొత్తగా 2 వంతెనలు నిర్మించడంతో దీని వినియోగం తగ్గింది. ఇదే అదనుగా దొంగలు బ్రిడ్జ్ ను ఎత్తుకెళ్లారు.
బైద్యనాథ్ డ్యామ్ ఆలయానికి వచ్చే కన్వారియా యాత్రికుల కోసం ఈ ఐరన్ స్టీల్ బ్రిడ్జ్ ని నిర్మించారు. బీహార్లోని సుల్తాన్ గంజ్ నుండి జార్ఖండ్లోని డియోఘర్కు వెళ్లే కన్వారియాల రాకపోకలకు రూ.45 లక్షల వ్యయంతో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో ఈ ఐరన్, స్టీల్ వంతెనను నిర్మించారు.
కాగా, దొంగలు వంతెనలను చోరీ చేయడం నెల రోజుల వ్యవధిలో ఇది మూడవ ఘటన. అందులో ఒక చోరీ రోహ్తాస్ జిల్లాలో చోటు చేసుకుంది. మరొక చోరీ జహనాబాద్ లో జరిగింది.
Extramarital Affair : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
కొన్ని వారాల క్రితం, నలంద జిల్లాలోని జహనాబాద్ను బీహార్షరీఫ్ను కలిపే దర్ధా నదిపై ఉన్న రహదారి వంతెన చోరీ అయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్లో రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల పనికిరాని ఇనుప వంతెనను పట్టపగలు దొంగల ముఠా చోరీ చేసింది. స్థానిక అధికారులు, గ్రామస్తుల సాయంతో వారీ వంతెనను దొంగిలించడం గమనార్హం.
కాగా, దొంగలు నీటి పారుదల శాఖ అధికారుల్లా వస్తున్నారు. ఎంచక్కా గ్యాస్ కట్టర్లు, ఎర్త్ మూవర్ మిషన్లతో వంతెనను కూల్చివేసి మూడు రోజుల్లో సామాగ్రిని ఎత్తుకెళ్లిపోతున్నారు. బీహార్ లో వరుస వంతెనల చోరీలు కలకలం రేపుతున్నాయి. అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దొంగలను ఎలా కట్టడి చేయాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు.