పేదరికంతో ఫీజు కట్టలేక.. విద్యార్ధిని ఆత్మహత్య
ఇంజనీర్ కావాలని అనుకున్న ఆశయాన్ని పేదరికం చిదిమేసింది. తండ్రి ఫీజు కట్టలేడు. ఫీజు ఇవ్వకుంటే కాలేజీ ఒప్పుకోదు. ఏ చేయాలో తెలియని పరిస్థితిలో ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తల్లిదండ్రుల ఆశలను చిదిమేస్తూ యువతి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తుంది. వివరాలలోకి వెళ్తే.. మంచిర్యాలకు చెందిన రాజేంద్రప్రసాద్, మాధవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఐదేళ్ల నుంచి హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి బృందావన్ కాలనీలో ఉంటున్నారు.
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజేంద్రప్రసాద్ పెద్ద కుమార్తె సుస్మిత(21) ఘట్కేసర్లోని ఏస్(ACE) ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సుస్మిత నాలుగో సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించలేదు. కళాశాల యాజమాన్యం ఫీజు కోసం అడిగినప్పటికీ తన తండ్రి కష్టాలను చూస్తున్న సుస్మిత.. ఫీజు గురించి తండ్రికి చెప్పలేదు.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కళాశాల యాజమాన్యం తండ్రి రాజేంద్రప్రసాద్కు ఫోన్ చేసిన కాలేజి యాజమాన్యం ట్యూషన్ ఫీజు చెల్లించని కారణంగా పరీక్ష ఫీజు రూ.1000 తీసుకోలేదని, అపరాధ రుసుంతో కలిపి పరీక్ష ఫీజు రూ. 10,000 కట్టాలని తెలిపారు. ఫీజు గురించి ఎందుకు చెప్పలేదని, తల్లి ప్రశ్నించడంతో మనస్తాపానికి గురైన సుస్మిత భవనం మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకిన సుస్మిత.. ఆసుపత్రిలో చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.