Vikarabad Forest : గుప్తనిధుల కోసం అటవీ ప్రాంతంలో తవ్వకాలు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు.

Vikarabad Forest : గుప్తనిధుల కోసం అటవీ ప్రాంతంలో తవ్వకాలు

Vikarabad Forest

Vikarabad Forest :  వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. గ్రామస్తులు అత్యంత భక్తి దాయకంగా పూజించే దేవుని లొద్దిలోని రామలింగేశ్వరస్వామి లింగాన్ని పక్కకు తప్పించి నిలువెత్తు లోతు వరకు తవ్వకాలు జరిపారు.

గ్రామానికి చెందిన కొందరు అయ్యప్పస్వామి మాలధారులు శబరిమలై వెళ్ళే ముందు రోజు రామలింగేశ్వరస్వామి వారిని మొక్కేందుకు  అక్కడికి వెళ్ళగా వారు అక్కడ  తవ్వకాలు  చూసి షాకయ్యారు.  భారీ ఎత్తున గుమ్మడికాయలు,నిమ్మకాయలు చూసి భయపడిన అయ్యప్ప స్వాములు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వెళ్ళి గ్రామంలోని పెద్దలకు ఈవిషయం చెప్పారు. దీంతో విషయం గ్రామమంతా పాకింది.

గ్రామస్తులంతా అక్కడికి వెళ్ళేసరికి  తవ్వకాల ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేశారు దుండగులు. గుమ్మడి కాయలు, నిమ్మకాయలు కనిపించకుండా చేసి శివలింగాన్ని యధాస్థానంలో ఉంచి గుంత పూడ్చేశారు. ఈ తవ్వకం జరిగిన మరి కొంత దూరంలో మరో పెద్ద గుంత  తీసి ఉండడం గమనించారు గ్రామస్తులు.
Also Read : Weather Forecast : ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 రోజుల పాటు వర్షాలు
అక్కడ ఉన్న ఆనవాళ్ళను బట్టి రోజుల తరబడి తవ్వకాలు జరిగి ఉంటాయని గ్రామస్థులు భావిస్తున్నారు.వందల ఏళ్ళ చరిత్ర ఉండి అత్యంత పవిత్రంగా పూజించే దైవ విగ్రహాలను గుప్త నిధుల కోసం ధ్వంసం చేయడం చాలా భాధాకరమని  గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటే తవ్వకాలు జరిపిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.