Hyderabad : బంజారా హిల్స్ కబ్జా స్ధలం.. కధా కమామీషు
హైదరాబాద్లో రియల్ భూమ్ రివ్వున ఎగిసిపడుతోంది. గజం స్థలం వేలు, లక్షల్లో పలుకుతోంది. అది సిటీకే హై హిల్స్లాంటి బంజారాహిల్స్ ప్రాంతంలో అయితే చెప్పక్కర్లేదు.
Hyderabad : హైదరాబాద్లో రియల్ భూమ్ రివ్వున ఎగిసిపడుతోంది. గజం స్థలం వేలు, లక్షల్లో పలుకుతోంది. అది సిటీకే హై హిల్స్లాంటి బంజారాహిల్స్ ప్రాంతంలో అయితే చెప్పక్కర్లేదు. అలాంటి చోట ఉన్న ఖాళీ స్థలంపై సీమ ఫ్యాక్షనిస్టుల కన్నుపడింది. అనుకున్నదే తడువుగా సిటీలోకి బస్సు కట్టుకొని మరీ దిగబడ్డారు. వంద కోట్ల స్థలాన్ని సర్దేసే ప్రయత్నం చేశారు. దాదాపు వంద మంది వచ్చి మారణాయుధాలతో హల్చల్ చేసి.. భయబ్రాంతులకు గురిచేసి భూమిని ఆక్రమించేశారు. గంటలోనే అక్కడ ఆఫీసుల్ని కూడా కట్టేశారు. సిటీలో సీమ రౌడీలు చేసిన హల్చల్ ఇప్పుడు సంచలనంగా మారింది.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్లో సీమ ఫ్యాక్షనిస్టులు రెచ్చిపోయారు. బస్సుల్లో వచ్చారు. భయబ్రాంతులకు గురిచేశారు. రోడ్ నంబర్ 10లో కోట్ల విలువైన భూమిని ఆక్రమించేశారు. ఖాళీ స్థలాన్ని గంటలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనక ఏపీకి చెందిన రాజకీయ నేత టీజీ వెంకటేశ్ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్ హస్తముంది. ల్యాండ్పై కన్నేసి కథ మొత్తం నడిపించింది ఆయనే అని అనుమానిస్తున్నపోలీసులు కేసులు నమోదు చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో రెండున్నర ఎకరాల భూమిని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో2005 లో ఏపీ జెమ్స్ అండ్ జువెలర్స్ పార్క్ కు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. అందులో దాదాపు రెండు ఎకరాల్లో ఆ కంపెనీ అభివృద్ధి పనులు చేయగా.. మిగతా స్థలం ఖాళీగా ఉంది. మార్కెట్ లెక్కల ప్రకారం ఈ స్థలం విలువ దాదాపు వంద కోట్లు ఉంటుందని అంచనా. ఈ ల్యాండ్ తమదే అంటూ సిటీకి చెందిన వీవీఎస్ శర్మ వాదిస్తున్నారు. లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ గురించి తెలిసిన టీజీ వెంకటేశ్ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్.. ఈ ల్యాండ్పై కన్నేశాడు. ఆ వ్యక్తితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. సమయం చూసి తన బ్యాచ్తో అక్కడ వాలిపోయాడు. సీమ నుంచి మనుషుల్ని దించి కబ్జా చేసేసాడు. ఈ స్థలం విషయంలో గతంలోనూ వివాదాలు జరిగాయి. కేసులు కూడా నమోదయ్యాయి.
పక్కా స్కెచ్తో తన రౌడీ బ్యాచ్ను సిటీలోకి దించాడు ఆ రాజకీయ నేత. హనుమాన్ జయంతి రోజు పోలీసులు అంతా శోభాయాత్ర బందోబస్తులో ఉంటే.. వందల కోట్ల విలువైన భూమిని గంటలో సర్దేశాడు. గుంపులుగా వచ్చిన వారు.. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులను భయబ్రాంతులకు గురిచేశారు. మారణాయుధాలతో బెదిరించి.. వారిని కట్టిపడేసి.. ల్యాండ్ను ఆధీనంలోకి తీసుకున్నారు. తమ వెంట తెచ్చిన రెడీమేడ్ క్యాబిన్లను ఆ స్థలంలో దించేసి.. ఏకంగా ఆఫీసులను స్టార్ట్ చేశారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీమ బ్యాచ్ను అరెస్ట్ చేశారు. ఈలోగానే విషయం తెలుసుకున్న అసలు క్యారెక్టర్స్ అన్నీ అక్కడి నుంచి సైలెంట్గా సైడ్ అయిపోయాయి. లీడర్లు జారుకుంటే.. అనుచరులు మాత్రమే పోలీసులకు చిక్కారు. దాదాపు 90 మంది సీమ నుంచి సిటీలోకి దిగితే.. 62 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు
Also Read : Hyderabad : బంజారాహిల్స్ లో రూ.100కోట్ల స్ధలం కబ్జాకు యత్నం
కోట్ల విలువచేసే ల్యాండ్ను కబ్జా చేసే స్కెచ్ ఎవరిదన్న దానిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 62మంది సీమ రౌడీలను విచారించారు. ఈ వ్యవహారంలో పొలిటీషియన్ టీజీ వెంకటేశ్, అతని సోదరుడి కుమారుడు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ సహా 15 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.స్థలానికి చెందిన చీఫ్ సెక్యూరిటీ అధికారి నగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టుబడిన వారిపై హత్యాయత్నం కేసుతో పాటు అక్రమప్రవేశం, సమూహంగా వచ్చి దాడి చేయడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారిపై భూకబ్జా, బెదిరింపులు ఇతర సెక్షన్ల కింద కేసులు పెట్టారు.