Kerala Anjushree Death Case : బిర్యానీ తిని యువతి మృతి కేసులో ట్విస్ట్.. అంజుశ్రీ మరణానికి కారణం ఏంటంటే..
Kerala Anjushree Death Case : కేరళలో బిర్యానీ తిని యువతి మృతి చెందిందనే వార్త తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. యువతి మృతి కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. కాసర్ గోడ్ కు చెందిన అంజుశ్రీది ఆత్మహత్య అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
యువతి సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. ఆమె ఫోన్ నుంచి కీలక వివరాలు రాబట్టారు. బిర్యానీ తిన్నాక ఫుడ్ పాయిజన్ తో అంజుశ్రీ మరణించిందని తొలుత అంతా అనుకున్నారు. కానీ, పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమె కడుపులో విషం ఉన్నట్లు గుర్తించారు. విషం తాగడం వల్లే అంజుశ్రీ చనిపోయిందని తేలింది. దీంతో అంజుశ్రీది సూసైడ్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఆమె మెంటల్ డిప్రెషన్ లో ఉన్నట్లు సూసైడ్ నోట్ లో పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే..
అంజుశ్రీ డిసెంబర్ 31న ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టింది. ఆ బిర్యానీ తిన్నాక అనారోగ్యం పాలైంది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కాసర్గోడ్ సమీపంలోని పెరుంబలకు చెందిన అంజు శ్రీపార్వతి(20) డిసెంబర్ 31న రొమాన్సియా అనే రెస్టారెంట్ నుంచి బిర్యానీ (కుళిమంతి) కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. బిర్యానీ ఇంటికి వచ్చింది. ఆ బిర్యానీని లొట్టలేసుకుంటూ ఆమె తినేసింది. అయితే, అది తిన్నాక ఆమె అనారోగ్యం బారిన పడింది. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. తొలుత ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మంగళూరులోని మరో హాస్పిటల్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలింది.
యవతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. బిర్యానీ తిన్న యువతి అనారోగ్యానికి గురై మరణించిందనే వార్త తీవ్ర కలకలం రేపింది. దీనిపై దుమారం రేగింది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా, అంజుశ్రీ చనిపోయింది ఫుడ్ పాయిజన్ వల్ల కాదని తేలిపోయింది.