Bike Thieves: యూట్యూబ్లో చూసి బైకులు కొట్టేశారు.. సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
యూట్యూబ్లో చూసి బైకులను చోరీ చేస్తూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలను ఇద్దరు కానిస్టేబుల్స్ ఛేజ్ చేసి పెట్టుకున్నారు. హాస్టళ్ల ముందు పార్కింగ్ సదుపాయం లేక బయటపెట్టుకుని ఉండే బైక్లను అర్థరాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు చూసుకుని దొంగతనం చేసే ముఠీను పోలీసులు పట్టుకున్నారు.
Hyderabad: యూట్యూబ్లో చూసి బైకులను చోరీ చేస్తూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలను ఇద్దరు కానిస్టేబుల్స్ ఛేజ్ చేసి పెట్టుకున్నారు. హాస్టళ్ల ముందు పార్కింగ్ సదుపాయం లేక బయటపెట్టుకుని ఉండే బైక్లను అర్థరాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు చూసుకుని దొంగతనం చేసే ముఠీను పోలీసులు పట్టుకున్నారు. పల్సర్ కంపెనీ స్పోర్ట్స్ బైక్స్ను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠాను ఆసిఫ్నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ కేవలం 12రోజుల వ్యవధిలోనే ఎనిమిది వాహనాలను తస్కరించినట్లు పశ్చిమ మండల పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.
ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ శివమారుతి, ఇన్స్పెక్టర్ ఎన్.రవీందర్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నరసరావుపేట ప్రాంతాలకు చెందిన శివరాత్రి చందు, చింతగుంట శివనాగ తేజ, గొల్ల మధు స్నేహితులు. ప్రైవేట్ ఉద్యోగులైన వీరిలో నాగతేజ ప్రస్తుతం కుందన్ బాగ్లోని ఓ హాస్టల్లో నివసిస్తూ ఉండగా.. ఈ ముగ్గురూ మద్యానికి బానిసలుగా మారారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో మద్యం తాగేందుకు చందు, మధు తరచూ తేజ వద్దకు వస్తూ ఉండేవాళ్లు.
ఈ క్రమంలోనే ఈజీ మనీ కోసం బైక్లను చోరీ చేయడం స్టార్ట్ చేశారు. ఆసిఫ్నగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని హాస్టళ్లలో పార్కింగ్ సదుపాయం లేని హాస్టళ్ల బయట ఉండే స్పోర్ట్స్ బైకులను చోరీ చేసేందుకు ప్లాన్ చేశారు. దొంగతనం చేసేందుకు టెక్నాలజీ సాయం కోసం యూట్యూబ్లో సెర్చ్ చేశారు. ఆ వీడియోల ఆధారంగా దొంగతనాలు చేయడం ప్రారంభించారు. చోరీ చేసిన వాహనాలను నరసరావుపేటలోని మధు ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో పెట్టి మళ్లీ సిటీకి వచ్చేవాళ్లు.
పన్నెండు రోజుల్లోనే ఆసిఫ్నగర్, ఎస్ఆర్ నగర్, కేపీహెచ్బీ కాలనీల్లో ఎనిమిది పల్సర్ స్పోర్ట్స్ బైక్స్ కొట్టేశారు. ఈ చోరీలను ఛేదించడానికి ఆసిఫ్నగర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ టీమ్ రంగంలోకి దిగింది. దాదాపు 100 సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ను పరిశీలించిన టీమ్ అందులో దొరికిన క్లూతో వారిని పట్టుకునేందుకు నిఘాపెట్టింది. ఈ క్రమంలోనే బైక్ దొంగలను గుర్తించిన కానిస్టేబుల్స్ రామకృష్ణ, శ్రీకాంత్ ఛేజ్ చేసి దొంగలను పట్టుకున్నారు. మొత్తం ముగ్గురినీ, ఈ కేసులో అరెస్ట్ చేసి, ఎనిమిది వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా వారిని పట్టుకున్నందుకు కానిస్టేబుల్లను అధికారులు అభినందించారు.