Govt Hospital : అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు.. మృతదేహాన్ని తరలించేందుకు రూ.80 వేలు డిమాండ్
నిన్న మంచిర్యాలలో ఉత్తర ప్రదేశ్కు చెందిన వలస కూలీ మోతిషా వడదెబ్బతో మృతి చెందాడు. స్వగ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కడసారి చూపును దక్కిందామనుకున్న అతని బంధువులకు అంబులెన్స్ డ్రైవర్లు చెప్పిన మాటలు షాక్ ఇచ్చాయి.
Manchiryala Govt Hospital : రోజురోజుకూ మానవత్వం మంటగలిసిపోతోంది. సాటి మనిషిని మనిషిగా చూడటం లేదు. సహాయం చేయాలనే ధోరణి కొరవడుతోంది. ప్రతి విషయాన్ని కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు. డబ్బే పరమావధిగా భావిస్తున్నారు. మానవ విలువలకు తిలోదకాలిస్తున్నారు. ఆఖరికి ఆపదలో ఆదుకునే అంబులెన్స్ డ్రైవర్లు సైతం కాసుల కక్కుర్తికి పాల్పడుతున్నారు. మానవ సమాజం సిగ్గపడే ఘటన ఒకటి మంచిర్యాలలో చోటు చేసుకుంది.
తిరుపతిలో అంబులెన్స్ మాఫియా కారణంగా కొడుకు మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లిన అమానుష ఘటన మరవక ముందే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మరో హృదయ విదాకర ఘటన జరిగింది. రెక్కాడితే కానీ డొక్కాడని వలస కూలీ మృతదేహంతో కూడా వ్యాపారం చేయాలని మంచిర్యాల అంబులెన్స్ డ్రైవర్లు చూశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు మృతుని తరపు బంధువులు.
నిన్న మంచిర్యాలలో ఉత్తర ప్రదేశ్కు చెందిన వలస కూలీ మోతిషా వడదెబ్బతో మృతి చెందాడు. స్వగ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కడసారి చూపును దక్కిందామనుకున్న అతని బంధువులకు అంబులెన్స్ డ్రైవర్లు చెప్పిన మాటలు షాక్ ఇచ్చాయి. మృతదేహాన్ని తరలించేందుకు అక్షరాల 80 వేల రూపాయలు ఇస్తే గానీ తరలించేది లేదని తేల్చి చెప్పారు.
మోతిషా మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న అతని బంధువులకు అక్కడి డ్రైవర్లు చెప్పిన మాటలు షాక్ ఇచ్చాయి. పొట్టకూటి కోసం రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చామని.. తమ వద్ద అంత డబ్బు లేదని చెప్పారు. అయినా రేటు తగ్గకపోవడంతో ఏం చేయాలో తెలియక.. అనాథ శవంలా అక్కడే వదిలేసి మోతిషా బంధువులు వెళ్లిపోయారు.