Pak Drone : పాకిస్తాన్ నుంచి జమ్మూకి డ్రోన్ ద్వారా ఆయుధాలు
జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని పహాలెన్ మండలం సౌజన్ గ్రామం వద్ద పాక్ వైపు నుంచి
Pak Drone జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని పహాలెన్ మండలం సౌజన్ గ్రామం వద్ద పాక్ వైపు నుంచి వచ్చిన ఓ డ్రోన్ వస్తువులు జారవిడవడాన్ని గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గ్రామాన్ని అధీనంలో తీసుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆయుధాలతో కూడిన ఓ పార్సిల్ను అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ నుంచి అక్రమంగా డ్రోన్ ద్వారా జమ్ములోని వ్యక్తులకు చేరవేసే క్రమంలో జారిపడి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న పార్సిల్ నుంచి ఏకే 47 రైఫిల్, మూడు మ్యాగజైన్లు, 30 రౌండ్ల బుల్లెట్లు, టెలిస్కోప్ ఉన్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. వాటిని సేకరించేందుకు వచ్చిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. గత సంవత్సర కాలంగా పాక్ వైపు నుంచి భారత్లోకి డ్రోన్ కార్యకలాపాలు పెరిగాయి. ఇది భద్రతా దళాలకు పెద్ద సవాల్గా మారింది. ఏడాది కాలంలో జమ్ముకశ్మీర్లో ఇలాంటి డ్రోన్లను భారీగా కూల్చివేసిన మన బలగాలు… పెద్ద ఎత్తున రైఫిల్స్, పేలుడు పదార్థాలు, బాంబులు, మాదక ద్రవ్యాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్లో జమ్మూలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై దాడి అనంతరం సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.