భర్తను హత్య చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన భార్య

భర్తను హత్య చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన భార్య

Wife Kills Husband, Puts Facebook Post, Then tries to kill herself in south delhi : సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక ప్రతివాళ్లు తమ అభిప్రాయాలు, ఉద్దేశ్యాలు, ఫీలింగ్స్ అన్నీ అందులో షేర్ చేసుకుంటున్నారు. అయినవాళ్లతోనూ, పక్కవాళ్లతోనూ మనసు విప్పి మాట్లాడం మానేశారు. ఢిల్లీలో ఒక మహిళ కూడా తన భర్తను హత్య చేసి ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఉదంతం వెలుగు చూసింది.

మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన మహిళ తన భర్తతో కలిసి 2013 నుంచి దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్ పూర్ ఎక్స్‌టెన్షన్‌ అపార్ట్‌మెంట్‌లో కాపురం ఉంటోంది. భార్యాభర్తలిద్దరు వేర్వేరు ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఈ దంపతులకు ఇంత వరకు సంతానం కలగలేదు. ఇద్దరూ తరచూ గొడవపడుతూ ఉండేవారని ఇరుగు పొరుగు వారు తెలిపారు. గత శనివారం జనవరి 2వతేదీ భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు.

ఆగొడవలో కోపం పట్టలేని భార్య భర్తను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసింది. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో షేర్ చేసింది. అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. రెండు రోజులతర్వాత సోమవారం నాడు ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని గమనించిన పక్కింటి వ్యక్తి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు లోపల గడియపెట్టి ఉండటంతో తలుపులు పగల గొట్టి లోపలకు వెళ్లి చూశారు.

అక్కడ భర్త రక్తపు మడుగులో పడి ఉండగా భార్య కొనఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. పోలీసులు వెంటనే ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సదరు మహిళపై హత్య, ఆత్మహత్యాయత్నం కింద కేసులు నమోదు చేసారు. మహిళ కోలుకున్నాక ఆమె వాంగ్మూలం రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు.