విషాదం : వనస్థలిపురం లాడ్జ్ లో యువతి ఆత్మహత్య
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. అభ్యుదయనగర్ లోని ఓ లాడ్జ్ లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగీత (43), లోకేష్ (28)లు 2017లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. సంగీత బెంగాల్ కు చెందిన మహిళగా గుర్తించారు. మొదటిసారిగా 2018 లో పంజాబ్ లో ఇద్దరు కలుసుకున్నారు. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సంగీత సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. (మే 5, 2019) ప్రియుడు లోకేష్ తో కలిసి సంగీత.. కోల్ కతా నుంచి హైదరాబాద్ కు వచ్చింది. వనస్థలిపురంలో అభ్యుదయనగర్ లోని ఓయో లాడ్జ్ లో ఉన్నారు.
లాడ్జ్లో ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగినట్లు, మనస్థాపంతో సంగీత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ఆమె ఆత్మహత్యపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. లోకేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.